TDP Mahanadu in Kadapa
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగకు సిద్ధమవుతోంది. మహానాడుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి కడపలో మహానాడు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు అవుతున్న తరుణంలో.. మరోసారి మహానాడును ఘనంగా నిర్వహించాలని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. అయితే పులివెందులలో మహానాడు నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పుడు వేదికను మార్చారు. కడప జిల్లా కేంద్రంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు టిడిపి నేతలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలోని టిడిపి నేతలు కడపను సందర్శించారు. మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. 50 వేల మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలాన్ని అన్వేషిస్తున్నారు.
Also Read : సొంత పార్టీ ఎమ్మెల్సీ పై టీడీపీ శ్రేణుల దాడి!
* కంచుకోటలో మహానాడు..
కడప( Kadapa ) అంటేనే వైఎస్ కుటుంబ అడ్డా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కడప అంటే ఆ కుటుంబ హవ నడుస్తూ వస్తోంది. అటువంటి చోట మహానాడు నిర్వహించడం అంటే ప్రాధాన్యతతో కూడిన అంశమే. అప్పట్లో నందమూరి తారక రామారావు సైతం కడప విషయంలో ఆలోచన చేసేవారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భాలే అధికం. అటువంటి చోట ఎన్నికల్లో పట్టు బిగించింది కూటమి. దానిని అలానే పదిలం చేసుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. అందుకే కడప వేదికగా టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు నిర్ణయించారు. మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు.
* పట్టు బిగిస్తున్న రెడ్డప్ప గారి కుటుంబం..
ఇప్పటికే కడప జిల్లా కేంద్రంలో రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ( reddappa Gari Madhavi Reddy ) పట్టు బిగిస్తున్నారు. ఆమె భర్త, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సైతం క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవి రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కడప కార్పొరేషన్ లో మేయర్ పై కాలు దువ్వుతున్నారు. ఇటువంటి తరుణంలో కడప జిల్లా కేంద్రంను పసుపు మయంగా మారిస్తే.. పొలిటికల్ సీన్ మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే అక్కడ మహానాడు కార్యక్రమాన్ని మూడు రోజులపాటు పండుగ వాతావరణం లో జరిపేలా ప్లాన్ చేస్తోంది టిడిపి హై కమాండ్. ఇప్పటికే టిడిపి అగ్రనేతలు కడప నగరంలో అడుగుపెట్టారు. మహానాడుకు సరైన వేదికను అన్వేషించే పనిలో పడ్డారు. దీంతో కడపలో ఒక రకమైన సందడి వాతావరణం కనిపిస్తోంది.
* ఖాళీ స్థలాల పరిశీలన..
కడప నగరం( Kadapa City) చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను టిడిపి నేతలు పరిశీలించారు. ప్రధానంగా కడప ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న స్థలాన్ని, రింగ్ రోడ్డు లోని జయరాజ్ గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. కడప సెంట్రల్ జైలు వద్ద ఉన్న ఎన్జీవో లేఅవుట్ ను కూడా పరిశీలించారు. ఈ మూడు స్థలాలను ఎంపిక చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు. వారి అభిప్రాయాన్ని తీసుకుని మహానాడు వేదికను ఖరారు చేయనున్నారు. అనంతరం పనులు ప్రారంభిస్తారు. మూడు రోజులపాటు జరిగే పార్టీ పండుగకు హాజరయ్యే నేతలకు, కార్యకర్తలకు ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.
Also REad : ఛార్లెట్లో ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Telugu desam party tdp to organize mahanadu in kadapa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com