CM Chandrababu: తెలంగాణలో( Telangana) టిడిపి యాక్టివ్ కానుందా? బిఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు టచ్ లోకి వచ్చారా? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. గులాబీ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో ఉన్న ఒకప్పటి టిడిపి నేతలు ఆందోళనతో ఉన్నారు. పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అని బెంగ వారిని వెంటాడుతోంది. ఈ తరుణంలో మళ్లీ టిడిపిని యాక్టివ్ చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టిడిపిని తెలంగాణలో బలోపేతం చేసే బాధ్యత తమది అంటూ కొందరు ముందుకు వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చంద్రబాబుతో వరుసగా చాలామంది నేతలు సమావేశం అవుతూ వస్తున్నారట. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు కేసీఆర్ వైఖరి కూడా మారుతోంది. వీటన్నింటినీ ప్రతికూలతలుగా భావిస్తున్న ఒక్కప్పటి టిడిపి నేతలు మాతృ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* టిడిపి పై ఉక్కు పాదం..
తెలంగాణలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పూర్తిగా నాశనం అయితేనే గులాబీ పార్టీ బలపడుతుందని కెసిఆర్ భావించారు. ఉద్యమ పార్టీగా ఉన్నంతవరకు తెలంగాణ అమరవీరులతో పార్టీని నడిపించారు. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు ఉండేవారు. ఎప్పుడైతే బంగారు తెలంగాణ అన్న నినాదాలు బయటకు తెచ్చారు అప్పటినుంచి టిడిపిని తొక్కడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలంతా కేసిఆర్ గొడుగు కిందకు. అయితే దాదాపు 9 సంవత్సరాల పాటు కెసిఆర్ హవా నడిచింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. ఒకవైపు అధికారి కాంగ్రెస్ పార్టీ దూకుడు.. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ బలం ముందు బిఆర్ఎస్ తేలిపోతోంది. ఆ పార్టీ ఇక పుంజుకోవడం కష్టమని.. కొత్త ముఖంతో వెళ్లడం ఉత్తమమని భావించి.. ఒకప్పటి టిడిపి నేతలు అంతా ఇప్పుడు చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. నడిపించే నాయకత్వం లేక.. ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడంతో క్యాడర్ స్తబ్దుగా ఉండిపోయింది.
* టిడిపి వైపు చూపు..
తెలంగాణలో ఎన్నికలు వస్తున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వైపు అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. టిడిపి మద్దతు దొరికితే విజయం తప్పకుండా దొరుకుతుందన్న ఆశ ఆ పార్టీల్లో ఉంది. అయితే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తారుమారు కావడంతో.. అందులో ఉన్న ఒక్కప్పటి టిడిపి నేతలు పునరాలోచనలో పడ్డారు. వారంతా చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన సమ్మతిస్తే తెలంగాణలో టిడిపి బలోపేతానికి తాము కృషి చేస్తామని వారు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా తెలంగాణలో ఉన్న ఒకప్పటి టిడిపి నేతలు అమరావతికి వచ్చి కలిసి వెళ్తున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత? చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది తెలియాల్సి ఉంది.