Telangana Revenue Minister : భారత రాష్ట్ర సమితి కోరుకున్నట్టుగానే.. గులాబీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టుగానే.. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి సాగిపోతోంది. ఆ పార్టీ లో సోషల్ మీడియాకు సరైన బలం లేదు. గులాబీ పార్టీ సోషల్ మీడియాను ఎదుర్కొనే స్థాయి లేదు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి దొరికిపోతూనే ఉంటుంది. ఆ పార్టీలో ఉన్న నాయకులు.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెబుతున్న మాటలు.. చేస్తున్న చేష్టలు.. వేస్తున్న అడుగులు.. అచ్చం గులాబీ పార్టీ ఆరోపించినట్టుగానే సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పరిధిలో 22a వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో హైకోర్టు సూచనల మేరకు కొన్ని ప్రాంతాలను మాత్రమే నిషేధ జాబితాలో చేర్చాల్సిన రెవెన్యూ అధికారులు.. ఆ వ్యవహారం మీద ఎటువంటి సమీక్ష జరపకుండానే.. ప్రైవేట్ స్థలాలను కూడా 22ఏ జాబితాలో చేర్చారు. దీంతో చాలామంది ఆ స్థలాలను అమ్మలేక.. కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై చాలామంది కోర్టును ఆశ్రయించారు. ఈ తరహా కేసులు ఇంకా కోర్టులో విచారణలో ఉన్నాయి.
22 ఏ వ్యవహారంపై గులాబీ పార్టీ నేతలు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. సొంత మీడియాలో.. సొంత సోషల్ మీడియాలో రకరకాల అభియోగాలు మోపుతున్నారు. వీటికి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేదు. అధికార యంత్రాంగం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా గులాబీ పార్టీ చేస్తున్న ప్రచారమే నిజమని చాలామంది నమ్మారు.. నమ్ముతున్నారు కూడా. మొత్తానికి రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత ఈ వ్యవహారం మీద తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
“కొద్దిరోజులుగా ఈ భూ వ్యవహారం మీద కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై కొంతమంది బాధపడ్డారని నా దృష్టికి వచ్చింది. గౌరవ సబ్ రిజిస్టార్లకు.. ఎమ్మార్వోలకు.. నేను ఒకటే సూచన చేస్తున్నాను.. ఎట్టి పరిస్థితుల్లో అన్ని భూములను బ్లాక్ లిస్టులో పెట్టకండి. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకండి.. ప్రభుత్వం తరఫున మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణ తెలియజేస్తున్నాను. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే అధికారులతో రివ్యూ చేశాను. ఇకపై ఇటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని” శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు
వాస్తవానికి ఈ వ్యవహారం మీద ప్రభుత్వం ఎప్పుడో రివ్యూ చేయాల్సి ఉండేది. సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారానికి అడుగులు వేయాల్సి ఉండేది. అలాకాకుండా ఇంత జరిగిన తర్వాత.. గులాబీ పార్టీ నేతలు ఈ స్థాయిలో రాద్ధాంతం చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెత తీరుగా ఉంది. ఇప్పుడు రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్పిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుందా.. తమ భూములను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగిస్తారా.. ఇప్పుడు ఇదే ఆశ హైదరాబాద్ నగర్ పరిధిలో భూములు కొనుగోలు చేసిన వారిలో ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు సమయం పట్టి అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి.
“I am sorry,” says Revenue Minister Ponguleti Srinivas Reddy over the inconvenience caused to the public due to errors in the 22A prohibited properties list pic.twitter.com/jCr1DmqE4A
— Telugu360 (@Telugu360) August 17, 2026