AP Government: మాటలాడే పద్ధతి బట్టి.. మన మాటలకు విలువ ఉంటుంది. ఎవరితో చెప్పిస్తే ప్రజలలోకి వెళ్తుందో.. వారితోనే చెప్పించాలి. ఇక రాజకీయ ప్రచారం అంటారా దానికంటూ ఒక వ్యూహం ఉంటుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధాన కారణం టిడిపి వ్యూహాత్మక ప్రచారం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా 2024 ఎన్నికలకు ఏడాది ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి స్పష్టంగా కనిపించింది. 2019లో 23 సీట్లతో సరిపెట్టుకున్న చంద్రబాబు.. అనుసరించిన పద్ధతి, ప్రజల్లోకి వెళ్లిన తీరు ప్రత్యేకమే. ఉప ఎన్నికల్లో గెలిచింది వైసిపి. స్థానిక ఎన్నికల్లో ఊచ కోత కోసింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి చతికిల పడింది. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి అటువంటి వ్యూహం కనిపిస్తోందా? అటువంటి మాట్లాడే నేతలు ఇప్పుడు బయటకు వస్తున్నారా? అంటే మాత్రం మౌనమే సమాధానమవుతోంది.
* ఏది చేసినా వ్యతిరేకంగానే..
2024 ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. అదే సమయంలో 2014 నుంచి 2019 మధ్య విపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తూ.. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ.. ప్రస్తుతం ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. మరో వైపు టిడిపి కూటమి చేసే ప్రతి పనిని చెప్పుకుంటుంది. దానిపై ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ప్రచారం చేస్తోంది. డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియాను వాడుకుంటుంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కేవలం టిడిపి వైఫల్యాలను ఎత్తిచూపే పనిచేసింది. రాజకీయంగా అనగదొక్కాలని చూసేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం తాము చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రచారం చేస్తూ ప్రజలే వైసిపి వైఫల్యాలను ఎత్తిచూపేలా చేస్తోంది. ఇది నిజంగా టిడిపి కూటమి ప్రచార బ్రహ్మాస్త్రమే.
* ఇప్పుడు ప్రతిదీ ప్రచారం తోనే..
అమరావతి రాజధాని నే తీసుకుందాం. 2014 నుంచి 2024 అమరావతిని ఒక గ్రాఫ్ గా చూపించే ప్రయత్నం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతి ఇప్పుడు హైలెట్ అవుతోంది. వైసిపి ఎంత గ్రాఫిక్స్ గా చూపిందో.. అంతకుమించి అన్నట్టు ప్రజల్లోకి వెళ్తోంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పారిశ్రామిక రంగం, విదేశీ పెట్టుబడులు, ఐటీ సంస్థలు.. ఇలా అన్నింటిపై కూటమి అనుసరిస్తున్న ప్రచారాస్త్రం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల పాశుపతాస్త్రమే. గతంలో ప్రత్యేక వర్గాలతో మాట్లాడించి.. వారి ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తెప్పించింది టిడిపి. కానీ ఇప్పుడు ఆ పని చేయలేకపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేందుకు తమ విశ్లేషణ ద్వారా.. తమ అభిప్రాయాల ద్వారా చెప్పించిన వారు సైతం ఇప్పుడు ముందుకు రాని పరిస్థితి.