Sajjala Ramakrishna Reddy: మొన్నటివరకు కనిపించకుండా పోయారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇటీవల యాక్టివ్ అయ్యారు. మీడియా ముందుకు వచ్చి గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే సజ్జలను సైడ్ చేసేసారని.. ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చేసారని తెగ ప్రచారం నడిచింది. అయితే హనుమంతుడు ముందు కుప్పి గెంతులా అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ వాటన్నింటినీ ఛేదించుకొని ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేతులతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైడ్ చేసేసారు. విజయసాయిరెడ్డి లాంటి వారిని పక్కన పెట్టించిన ఘనత సజ్జల రామకృష్ణారెడ్డిది. అటువంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక లెక్క అన్నట్టు ఉంది. అందుకే చాలా సులువుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పక్కన పెట్టేలా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందులో చాలావరకు సక్సెస్ అయ్యారు కూడా.
* పెద్ద ఎత్తున ఫిర్యాదులతో..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అన్ని వేళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపించాయి.. సహజంగానే అప్పట్లో పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించారు సజ్జల. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా కేవలం సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వచ్చిన ఆయన.. అన్ని తానై వ్యవహరించడం సీనియర్లకు మింగుడు పడలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్లు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఆయనను పక్కన పెట్టాలని జగన్ మోహన్ రెడ్డిని కోరారు. అయితే ఇంతలో సజ్జల ప్లేస్ పై దృష్టిపెట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సర్వేలతో పాటు నానా రకాల పేర్లు చెప్పి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఒకవైపు సీనియర్ల ఫిర్యాదులు.. మరోవైపు చెవిరెడ్డి పాచికలతో సజ్జల రామకృష్ణారెడ్డి సైలెంట్ కావాల్సి వచ్చింది.
* ఆధారాలతో సహా జగన్ కు..
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీలో ఈ స్థాయికి చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అంతలా ఉంటుంది ఆయన రాజకీయ నేర్పరితనం. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై దృష్టి పెట్టారు. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏకంగా 600 కోట్ల రూపాయలను చెవిరెడ్డి పక్కదారి పట్టించారని ఆధారాలతో సేకరించారు. మరోవైపు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో భోజన ఖర్చులు కింద అధికంగా వసూలు చేశారని.. అది ఎగ్ పఫ్ ల కింద చూపించారని.. పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ జరిగిందని ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డి సేకరించారు. ప్రత్యేక పవర్ పాయింట్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి దేనినైనా సహిస్తారు కానీ.. తనకు తెలియకుండా అవినీతికి పాల్పడితే మాత్రం సహించరు. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచి చంద్రగిరి నియోజకవర్గానికి పరిమితం కావాలని ఆదేశించారు. ఇలా తాడేపల్లి వర్గాల నుంచి బయటకు వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి.