Posani Krishnamurali : వైసిపి ఫైర్ బ్రాండ్లలో పోసాని కృష్ణ మురళి ఒకరు. వైసీపీ ఆవిర్భావం తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి అడుగులు వేసిన వారిలో పోసాని కృష్ణమురళి ముందుంటారు. జగన్ కు బాహటంగానే మద్దతు పలికారు పోసాని. 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆయన. కానీ తరువాత జగన్ వెంట అడుగులు వేశారు. ఆ పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడడంలో ముందుంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో పోసానికి తప్పకుండా నామినేటెడ్ పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అదిగో ఇదిగో అంటూ ఆలస్యం జరిగింది. చివరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు పోసాని. అయితే గత ఐదేళ్లుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ కంటే రాజకీయ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ పై తరచూ విరుచుకుపడుతుండేవారు. ఒకానొక దశలో చిరంజీవి రాజకీయాలకు అన్ఫిట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబం పై విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో చిరంజీవి మాతృమూర్తి పై తిట్ల దండకం అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ అభిమానులకు టార్గెట్ అయ్యారు పోసాని. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు. పనిలో పనిగా తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి.
* వైసిపి ప్రభుత్వ హయాంలో..
వైసిపి ప్రభుత్వ హయాంలో సినీ నటులపై చాలా రకాల ఆరోపణలు చేశారు ఆ పార్టీ ప్రతినిధులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడారు. అదే సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే నాడు ఒక్క సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున కుటుంబం పై ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారంటూ ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. వరుసగా డిబేట్ లు నడుస్తున్నాయి.
* ఎల్లో మీడియాలో కథనాలు
ప్రధానంగా అప్పట్లో పోసాని కృష్ణ మురళి వ్యవహరించిన తీరుపై ఎల్లో మీడియాలో చర్చలు కొనసాగిస్తూ గుర్తుచేస్తున్నారు. నాడు పవన్ కళ్యాణ్ మాతృమూర్తిని పోసాని కించపరిచారు అంటూ చెబుతున్నారు. ఈ లెక్కన పోసానిని ఏం చేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో స్పందించారు పోసాని. తనకు ఏబీఎన్ రాధాకృష్ణ, వెంకటకృష్ణ బ్యాచ్ నుంచి ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మాతృమూర్తినే అవమానించలేదని కూడా అన్నారు. పవన్ అభిమానులు తనపై విమర్శలు చేసిన తాను ఎన్నడు వారిపై విమర్శలు చేయలేదని గుర్తు చేసుకున్నారు. అయితే వైసిపి హయాంలో ఏ చిన్నపాటి ఘటన జరిగిన పవన్ పై విరుచుకుపడేవారు పోసాని. కానీ తాను ఎవరిపై విమర్శలు చేయలేదని తాజాగా చెబుతుండడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More