Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు చేశారు. ఏకంగా అక్కడికి వెళ్లి హంగామా సృష్టించారు. కోడి చెరువుకు హద్దులు పెట్టారని.. ఎఫ్ టి ఎల్ పరిధిలో చెరువును ఆక్రమించానని ఆరోపించడం మొదలుపెట్టారు.
దీనిపై హైడ్రా రంగనాథ్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఫలితంగా ఆయన క్షేత్రస్థాయికి వెళ్లారు. తన బృందంతో కలిసి కోడి చెరువును పరిశీలించారు. కోడి చెరువు అనేది జన్వాడ పరిధిలో ఉంటుంది. ఇక్కడే గతంలో కేటీఆర్ కు వ్యవసాయ క్షేత్రం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కాలంలో శ్రీమంతులు జన్వాడ ప్రాంతంలో భారీగా భూములు కొని, వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకుంటున్నారు. హైడ్రా రంగనాథ్ పరిశీలనలో కోడి చెరువులో పరిధిలో ఉన్న భూములు కొన్ని ఎకరాలు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని 2014లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ కోడి చెరువు ఆక్రమణలపై నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కానీ ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఇటీవల కాలంలో కొంతమంది హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి ప్రయత్నాలు చేశారు. వారికి సాక్షి మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. డిబేట్ కూడా పెట్టింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెరువును ఆక్రమించారు అనే విషయం మీద హైడ్రా రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన పరిశీలనలో కోడి చెరువు ను పవన్ కళ్యాణ్ ఆక్రమించినట్టు తేలలేదు. చెరువులో మట్టి నింపిన ఆనవాళ్లు కనిపించలేదు. చెరువు స్వరూపం కూడా మారలేదు. నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకి కూడా ఏర్పడలేదు. అయితే ఆ చెరువు పక్కన ఉన్న కొంత మంది యజమానులు మట్టితో నింపారు. నీటి ప్రవాహం వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం అడ్డుకట్ట వేయలేదు. కాకపోతే తాను కొనుగోలు చేసిన భూమికి మాత్రం ఆయన ఫెన్సింగ్ వేసుకున్నారు.
ఇదే విషయాన్ని హైడ్రా రంగనాథ్ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వెల్లడించారు. “ఈమధ్య జరుగుతున్నవన్నీ సోషల్ మీడియా వేదికగానే చోటుచేసుకుంటున్నాయి. అదేందో అర్థం కావడం లేదు. ఎవరికివారు ఫోటోలు సృష్టిస్తున్నారు. వాటిని నిజమని భ్రమలు కల్పిస్తున్నారు. కొంతమంది వాటి చుట్టూ రాజకీయాలు అల్లుతున్నారు. ఇలాంటి సమయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి. వాటి అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి వస్తోంది. కోడి చెరువు విషయంలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇలాంటి ప్రయత్నమే చేసాం. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఆక్రమించినట్టు కనిపించలేదు. భూ యజమానులు మాత్రమే చెరువుని మట్టితో నింపి ఆక్రమించారు. నీరు సక్రమంగా పారడం లేదు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. మొత్తంగా ఈ చెరువు విస్తీర్ణం 32 ఎకరాలు. అయితే చాలా వరకు కబ్జా గురైంది. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని” హైడ్రా రంగనాథ అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్నాళ్లపాటు పవన్ కళ్యాణ్ మీద వచ్చిన విమర్శలకు క్లారిటీ వచ్చినట్లు అయింది.





