Nara Lokesh: కొందరు విజయం మరికొందరికి మింగుడు పడదు. కొందరికి వచ్చిన గుర్తింపును చూసి మరికొందరు తట్టుకోలేరు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ విషయంలో కూడా అదే. ఆయన పనితీరును మెచ్చి అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ ఇండియా లో ప్రత్యేక వ్యాసం వచ్చింది. అయితే అది డబ్బులు ఇచ్చి రాసుకున్నది అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అలా పబ్లిసిటీ కోసం రాయించుకున్నారనేది ఆ పార్టీ వాదన. అయితే ఇక్కడ తగ్గించింది లోకేష్ ఇమేజ్ ను కాదు. సదరు అంతర్జాతీయ పత్రిక గౌరవాన్ని. ఎందుకంటే అంతర్జాతీయంగా కొన్ని పత్రికలు ఆ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి అంటే దానికి కారణం వాటికి ఉన్న క్రెడిబిలిటీ. దానిని సొమ్ముతో కొనుగోలు చేసేటంత పరిస్థితి ఉందంటే కచ్చితంగా ఆ పత్రికను ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకున్నారు అంటే దానికి క్రెడిబిలిటీ ఉందన్నమాట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నమాట.
* జగన్ కు నో ఛాన్స్..
ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించారు జగన్మోహన్ రెడ్డి. పైగా ఆయనకు వేల కోట్లు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎన్నో రకాల వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. అటువంటప్పుడు ఆయన ఎంత ఖర్చైనా చేయగలరు పబ్లిసిటీ కోసం. కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇలాంటి అంతర్జాతీయ పత్రికల్లో ఆయన ముఖచిత్రం రాలేదు. బహుశా 2019 ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించినప్పుడు ఈ చోటు దక్కి ఉంటుంది. పాలనలో మాత్రం ఆయన పెద్దగా మార్కు చూపింది లేదు. ఆయన పనితీరును, పాలసీని సాక్షి ప్రశంసించి ఉండవచ్చు. జాతీయ మీడియా అయితే ఆయన తీరును ఎక్కువగా ఎండగడుతూ వచ్చింది. రాష్ట్రాన్ని ఎలా తిరుగమనంలో పట్టించారో లోకల్ మీడియా కంటే నేషనల్ మీడియాకు తెలుసు. అయితే తనకు రాని గౌరవం అనతి కాలంలోనే ఇప్పుడు లోకేష్ సాధిస్తుండడం మింగుడు పడని విషయం.
* తేల్చేసిన ఫ్యాక్ట్ చెక్..
తాజాగా మంత్రి నారా లోకేష్ పై అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ ఇండియాలో ప్రత్యేక వ్యాసం వచ్చింది. ముఖచిత్రంతో కూడిన ఈ వ్యాసం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ షేక్ ప్రచారానికి దిగింది. ఈ ప్రత్యేక వ్యాసం రాయించుకోవడానికి ప్రభుత్వం కోటికి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసిందంటూ వైసిపి ఒక ఫేక్ జీవోను వైరల్ చేస్తోంది. ఆ జీవో 18-1-202 కి సంబంధించినది. అది ఎంత మాత్రం ఫార్చ్యూన్ ఇండియాతో సంబంధం లేదు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక సానుకూలతలను గ్లోబల్ వేదికలపై ప్రచారం చేసేందుకు.. ప్రముఖ అంతర్జాతీయ ఆంగ్ల న్యూస్ ఛానల్ CNBC TVతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆ ఛానల్ కు చెల్లింపులు జరపాలని సదరు జీవో ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సిఎన్బిసి టీవీ, ఫార్చ్యూన్ ఇండియా రెండు పూర్తిగా భిన్నమైన మీడియా సంస్థలు. ఆ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే ఇప్పుడు లోకేష్ పై వచ్చిన కథనంతో వైసీపీలో ఒక రకమైన బాధ వ్యక్తం అవుతుంది. అందుకే ఈ ఫేక్ ప్రచారానికి దిగింది. దీనిపై ప్రభుత్వ ఫాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. తప్పుడు ప్రచారాన్ని సృష్టించిన వారితో పాటు నిజా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తూ.. ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.