TV9 Telugu: సో వాట్.. మీడియా సంస్థలు ఏమి శంకర మఠాలు కాదు. కేవలం సత్యవాక్కులు మాత్రమే వల్లించడానికి అవేవీ హరిచంద్రుడి ఇలా కాలు కావు. రాజకీయ నాయకులు ఎలాగైతే కండువాలు మార్చుతారో.. మీడియా సంస్థలు కూడా తమ ఆర్థిక అవసరాల కోసం ప్లేట్లు ఫిరాయిస్తూ ఉంటాయి. సంస్థలే కాదు.. సంస్థలో పనిచేస్తున్న వారు కూడా అలానే ఉంటారు.
తెలుగులో సుప్రసిద్ధ న్యూస్ నెట్వర్క్ టీవీ9 సొంతం. టీవీ9 మొదట్లో తెలుగులో ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక భాషలకు విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ ఉన్న సంస్థలలో టీవీ9 ఒకటిగా నిలిచింది. టీవీ9 ప్రస్తుతం మై హోమ్, మేఘా కంపెనీల చేతిలో ఉంది. ఈ కంపెనీలకు ఎన్టీవీ.. 10 టీవీ వంటి లీడింగ్ మీడియా సంస్థలలో వాటాలు ఉన్నాయి. సో గట్టి ఆర్థిక సంపత్తి ఉన్న వాళ్లంతా మీడియాను తమ చేతిలో పెట్టుకున్నారు.
మొదట్లో టీవీ9 కేసీఆర్ కు అనుకూలంగా ఉండేది. అప్పట్లో కెసిఆర్ ఏబిఎన్ ను తొక్కి వేసే కార్యక్రమంలో భాగంగా టీవీ9 ను కూడా తొక్కే ప్రయత్నం చేశాడు. మేనేజ్మెంట్ కాళ్ళ దగ్గరికి రావడంతో టీవీ9 గొంతు సవరించుకుంది. పదేళ్లపాటు కేసీఆర్ పాట పాడింది ఆ తర్వాత కొద్దిరోజులు బిజెపి వైపు.. ఇప్పుడు టిడిపికి అనుకూలం అనుకోవాలా.. ఏమోలే మీడియా ఆధిపతులు.. వాళ్ల ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి తోడు టీవీ 9 తెలుగులో పెద్ద తలకాయ లాగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో చాలామంది జర్నలిస్టులు బయటకు వెళ్లిపోయారట
సరే ఇప్పుడు టీవీ 9 టిడిపికి అనుకూలంగా ఎందుకు మారిపోయింది.. అని ఒకసారి లోతుగా ఆలోచిస్తే.. సుప్రసిద్ధ జర్నలిస్టు ఇనగంటి వెంకట్రావు కుమారుడు ఇనగంటి అనిల్ టీవీ9లో చేరినట్టు తెలుస్తోంది. పైగా ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అనిల్ ప్రారంభంలో మహా న్యూస్ బాధ్యతలు చూశారు. ఆ తర్వాత తెలుగుదేశం క్యాంపులోకి వెళ్లిపోయారు. టిడిపి వీడియోలు.. డిజిటల్ ప్రసరణ వంటి వాటిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
అనిల్ టీవీ9 లో చేరిపోయిన తర్వాత.. ఛానల్ విధేయత మారిపోయినట్టే. పొలిటికల్ లైన్ కూడా వేరే వైపు తీసుకున్నట్టే. పైగా ఏపీలో ఇప్పుడు మెజారిటీ ఇరిగేషన్ వర్కులు మొత్తం మేఘా చేతిలో ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే పనులు కూడా ఆ కంపెనీకి దక్కే అవకాశం ఉంది. పైగా మేఘా కృష్ణారెడ్డి కంపెనీ మొత్తాన్ని సొంతం చేసుకునే పనిలో పడ్డాడు. మరో వాటా దారు అయిన పిచ్చిరెడ్డి నుంచి వాటాలు కొనుగోలు చేసే ప్రక్రియలో బిజీగా ఉన్నాడు. ఇలాంటప్పుడు చేతినిండా వర్కులు ఉండాలి. కేవలం సెంట్రల్ వర్క్ లతోనే పని కాదు. పుట్టిన గడ్డ ఏపీ నుంచి కూడా గట్టిగానే పనులు ఉండాలి. ఆ పనులు జరగాలంటే ఇప్పుడు లోకేష్ తో జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు లోకేష్ చెప్పినట్టుగా చేయాలి.. అందువల్లే అనిల్ కు టీవీ9 లో కీలక పోస్టు కట్టబెట్టినట్టు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పైగా ఇప్పుడు టిడిపిలో ప్రతి వ్యవహారాన్ని లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు అయితే కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ లోకేష్ అలా కాదు కదా.. దూకుడును 2.0 స్థాయిలో చూపిస్తున్నారు. అందువల్లే జగన్ ప్రతి రెండు రోజులకు ఒకసారి విలేకరుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. దీనిని బట్టి లోకేష్ ఎలాంటి పొలిటికల్ అడుగులు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
స్థూలంగా చెప్పాలంటే తెలుగులో మీడియా కంపెనీలు నిష్పక్షపాతంగా లేవు. ఏదో ఒక పార్టీకి డబ్బు కొట్టడం.. ఏదో ఒక రాజకీయ నాయకుడికి జేజేలు పలకడం.. కాకపోతే గతంలో ఇది తెర వెనక జరిగేది. ఇప్పుడు ఓపెన్ గానే సాగిపోతోంది. ఇటీవల తెలంగాణలో ఓ ఛానల్ అధికార పార్టీకి అనుకూలంగా ఉండేది. ఆ తర్వాత ఏపీలో ఓ నాయకుడి పంచన చేరిపోయింది. ఆ తర్వాత డిఎస్సి వ్యవహారాలను తవ్వితీసింది. కానీ ఒక్క తొక్కుడు తొక్కితే మేనేజ్మెంట్ కు వాస్తవం అర్థమైంది. ఆ చానల్లో నాలుగు తలకాయలు పక్కకు తప్పుకున్నాయి.
టీవీ చానల్స్ లోగోలలో కొన్ని రంగులు మాత్రమే కనిపిస్తాయి. కానీ వాస్తవంలో రాజకీయ పార్టీల నాయకులు మార్చే రంగులకు మించి చానల్స్ కి ఉంటాయి. తమ ప్రయోజనాలకు అనుగుణంగా చానల్స్ రంగులు మారుస్తూ ఉంటాయి.. అందులో పని చేసే జర్నలిస్టులు అవకాశాలకు తగ్గట్టుగా కండువాలు మార్చుతూ ఉంటారు.