Nagababu : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమీపిస్తోంది. ప్రచార పర్వం సైతం ఉధృతంగా సాగుతోంది. ఎల్లుండి సాయంత్రం తో ప్రచారం గడువు ముగుస్తుంది. అందుకే అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. మరోవైపు కీలక నేతలు బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో మూడు బహిరంగ సభలతో పాటు విజయవాడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో కూటమికి పాజిటివ్ వైబ్రేషన్ ప్రారంభమైందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కూటమి నేతలు సభలు, సమావేశాల్లో బిజీగా ఉండగా.. స్టార్ క్యాంపైనర్లు మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందని.. మరోసారి అధికారం ఇస్తే ఇంకేం మిగలదని తేల్చి చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి పడకేసిందని.. కియా, అమర రాజా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పాలని కూడా నాగబాబు పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ ఉన్న పవన్, పరిపాలన దక్షత ఉన్న చంద్రబాబు, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇప్పటికే కూటమి తరుపున నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంకా 48 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఒకవైపు సభలు, సమావేశాలు, రోడ్ షోలు కొనసాగుతుండగా.. మరోవైపు నేతలు మీడియాలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఈనెల 11న చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారని ఒక టాక్ నడుస్తోంది. అదే రోజు చంద్రబాబుతో పాటు చిరంజీవి కూడా మీడియాతో మాట్లాడతారని ఒక వార్త వైరల్ అవుతోంది. మరోవైపు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తో పాటు కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో నాగబాబు సైతం యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే వైసీపీ సర్కార్ పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.