Telugu student : అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్థుల వరుస మరణాలు, అదృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిక పది మందికిపైగా వివిధ కారణాలతో మరణించారు. తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. వారం రోజులుగా అతడి ఆచూకీ లేదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
మే 2న మిస్సింగ్..
భారత్కు చెందిన విద్యార్థి రూపేశ్చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదని కాన్సులేట్ అధికారులు తెలిపారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే రూపేశ్ జాడ తెలుస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు. ఈమేరకు షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. రూపేశ్ జాడ తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు.
తెలంగాణ వాసి..
రూపేశ్చంద్ర తెలంగాణ వాసి. ప్రస్తుతం విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని అభ్యర్థించారు.
వరుస ఘటనలు..
ఈ ఏడాది ఆరంభం నుంచి అగ్రరాజ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయులు, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వరుస ఘటనలపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.