Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు పుష్కర కాలంగా పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయ్యారు. పూర్తిగా బ్యాలెన్స్ పాటిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సఖ్యతగా మెలుగుతున్నారు. ఈసారి మరి రాజకీయాల జోలికి వెళ్ళనన్న నిర్ణయంతో ఉన్నారు మెగాస్టార్. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం లో కీలక బాధ్యతలు తీసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలిపారు చిరంజీవి. తద్వారా కూటమికి అనుకూల సంకేతాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సైతం హాజరయ్యారు. అందుకే ఇప్పుడు చిరంజీవిపై జరుగుతున్న ప్రచారాన్ని ఎక్కువమంది నమ్ముతున్నారు.
* ప్రజారాజ్యం పార్టీ ద్వారా..
ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని భావించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను తెచ్చుకున్నారు. అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంతో కొద్దిరోజులకే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తెరమరుగయింది. అప్పటినుంచి గౌరవంగా రాజకీయాల నుంచి తట్టుకొని మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. దాంట్లోనే కొనసాగుతూ వస్తున్నారు.
* అందరితోనూ సఖ్యత..
చిరంజీవి రాజకీయాలను విడిచిపెట్టిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కెసిఆర్, తదనంతర పరిణామాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన జగన్, రేవంత్ రెడ్డి లతో ఎంతగానో గౌరవంగా మెలిగారు. వారు కూడా చిరంజీవి విషయంలో అంతే గౌరవం ఇచ్చారు. కానీ 2019లో జనసేన ఓటమి, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం వంటి కారణాలతో ఎన్నెన్నో అవమానాలకు గురయ్యారు. అందుకే 2024 ఎన్నికల్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. కూటమిపట్ల సానుకూలత వ్యక్తం చేశారు. కూటమి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
* కేవలం ఒకే ఒక్క కారణంతో..
ప్రస్తుతం ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేన కేలకనేతగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామ క్రమంలో కూటమిపట్ల చిరంజీవి సానుకూలంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి. అయితే త్వరలో చిరంజీవిపై పెద్ద బాధ్యత పెట్టనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు అభివృద్ధి చేపడుతూనే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవిని నిర్మించాలని చూస్తోంది. అయితే ఇప్పటికే చిరంజీవిని బిజెపిలోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇటువంటి సమయంలో కూటమి ప్రతిపాదనను గౌరవిస్తారా? లేదా? అన్నది చూడాలి.