YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అందుకే పాదయాత్రకు ఆయన సిద్ధపడుతున్నారు. అయితే గతం మాదిరి కాదు. ఈసారి సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి.. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్ల పాటు పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. జగన్ పాదయాత్రతో పార్టీకి పూర్వవైభవం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
* పాదయాత్రతో సూపర్ విక్టరీ..
గతంలో పాదయాత్ర తోనే అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. బలమైన ప్రతిపక్ష స్థానంలో వైసిపి ఉండేది. 67 సీట్లతో అధికార టిడిపికి దీటైన జవాబు ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో 17 లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పట్లో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు జగన్. పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు దోహద పడింది. పైగా వన్ చాన్స్ అనే నినాదం అప్పట్లోనే బలంగా వినిపించ గలిగారు జగన్. ప్రజలు కూడా బలంగా నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. అందుకే 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కట్టబెట్టారు. సూపర్ విక్టరీని అందించారు.
* కలిసి వచ్చిన కాలం..
పాదయాత్రలతో వైయస్ కుటుంబం బాగానే లబ్ధి పొందింది. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. అయితే తరువాత పాదయాత్ర చేశారు షర్మిల. కానీ వర్కౌట్ కాలేదు. మధ్యలో చంద్రబాబు పాదయాత్ర చేసి టిడిపిని అధికారంలోకి తెచ్చారు. తరువాత జగన్ అదే పాదయాత్రతో గెలిచారు. మొన్నటికి మొన్న తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ పాదయాత్ర చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అయితే ఇప్పుడు రెండోసారి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్. మరి ప్రజలు గుర్తిస్తారా? లేదా? అన్నది చూడాలి.
* గ్రౌండ్ వర్క్ తో సిద్ధం..
వచ్చే ఏడాది జూలై తరువాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను టచ్ చేస్తూ.. ఈ పాదయాత్ర కొనసాగుతుందని సమాచారం. ఈసారి 5000 కిలోమీటర్ల పాటు జగన్ నడుస్తారని.. ప్రతి కార్యకర్తను టచ్ చేస్తారని తెలుస్తోంది. అయితే రెండేళ్ల పాటు కొనసాగే ఈ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తానని జగన్ భావిస్తున్నారు. గతం మాదిరిగా పాదయాత్ర విషయంలో విజయవంతం పై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ఒక్కసారి కూడా అధికారం చేపట్టలేదు. ప్రజల్లో సానుభూతి కనిపించేది. ఇప్పుడు జగన్ పాలనను చూసి ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర విజయవంతం పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి.