Homeఆంధ్రప్రదేశ్‌YCP: మావిగన్ సరే.. ఆ వైసీపీ నేతల బాధ అంతా ఇంతా కాదు!

YCP: మావిగన్ సరే.. ఆ వైసీపీ నేతల బాధ అంతా ఇంతా కాదు!

YCP: జగన్ మావిగన్ స్టాండ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఆందోళనకు కారణం అవుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్లు చాలామంది అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. ఏకంగా అమరావతి వర్సెస్ మావిగన్ అన్నట్టు వచ్చే ఎన్నికల అజెండాగా డిసైడ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. కనీసం పార్టీలో చర్చించకుండా ఎలా ప్రకటన చేస్తారని సీనియర్ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు తెగ బాధపడుతున్నట్లు సమాచారం. అప్పట్లో విశాఖకు పాలన రాజధానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సీనియర్లను పురమాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నఫలంగా విశాఖను మరిచి మళ్లీ మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో వారు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు అయితే కోపంతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

* పాలనా రాజధానిగా విశాఖ..
విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కచ్చితంగా విశాఖ నుంచి పాలన మొదలు పెడతామని చెప్పుకొచ్చారు. రుషికొండ భవనాలు అందుకోసమే అనేది బహిరంగ రహస్యమే. కానీ ఆ భవనాలు విషయంలో అప్పట్లో స్పష్టత ఇవ్వలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. కానీ పాలనా రాజధానిగా అన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు విశాఖ నుంచి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత కల్పిస్తుంటే అప్పటి టిడిపి, జనసేన నేతలు వ్యతిరేకించారని.. దీనిని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పడంతో.. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు విడమరిచి చెప్పారు. విశాఖకు రాజధాని వస్తే ఈ ప్రాంతమే మారిపోతుందని.. అందుకే ప్రజలు అర్థం చేసుకోవాలని అప్పట్లో గ్రామాలకు వెళ్లి మరి ధర్మాన ప్రసాదరావు ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా సైతం అభివృద్ధి చెందుతుందని.. మన జిల్లా సైతం రాజధాని ప్రాంతమేనని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పుకొచ్చారు.

* వైసీపీ సీనియర్ల కీనుక..
అయితే ఇప్పుడు మూడు రాజధానులను మడతపెట్టి.. మావిగన్ అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. మా స్టాండ్ మావిగన్ అని తేల్చి చెప్పారు. అమరావతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. దీంతో తమతో విశాఖ రాజధానికి మద్దతుగా ప్రచారం చేయించారని.. అటువంటప్పుడు ప్రజలకు ఎలా ముఖం చూపించుకుంటామని వారు ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. అటు అమరావతి రైతులకు వ్యతిరేకమై.. ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు మభ్యపెట్టి మనం చేసేది ఏంటి అని వైసిపి సీనియర్లు అంతర్మధనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్ననే దేవినేని అవినాష్ తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు అని తేల్చి చెప్పారు. ఇంతలోనే అమరావతికి వ్యతిరేకం అని జగన్ ప్రకటించేశారు. మరోవైపు రాయలసీమ నేతలు సైతం జగన్ రాజధాని స్టాండ్స్ పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular