Karumuri Arrest: మద్యం కుంభకోణం కేసులో మళ్లీ సంచలనం. అరెస్టుల పర్వం మొదలైంది. అయితే ఈసారి అనూహ్యంగా ఇది ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగించడం విశేషం. వైసిపి మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు జరిగింది. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో ఆయన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఈడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి తొలుత అరెస్ట్ అయ్యారు. తరువాత వైసిపి హయాంలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప.. ఇలా చాలామంది అరెస్టయ్యారు. ఇందులో ఒక్క రాజ్ కసిరెడ్డికి తప్ప మిగతా వారికి బెయిల్ లభించింది. కానీ ఇప్పుడు ఈడి ఎంట్రీ ఇచ్చి అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది.
* రూ.28 కోట్ల ముడుపులు..
మద్యం కుంభకోణానికి సంబంధించి రవాణాలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఏకంగా 28 కోట్ల రూపాయల మేర ముడుపులు స్వీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారుల నుంచి ఈ భారీ మొత్తాన్ని హవాలా మార్గాలు, డొల్ల కంపెనీల ద్వారా చేతులు మార్చినట్లు గుర్తించింది ఈడి. ఈ మూలాలను వెలికి తీసేందుకు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణిస్తోంది. అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమ రవాణాకు సహకరించడం వల్లే ఈ స్థాయిలో అవినీతి చేయగలిగారని గుర్తించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
* సుప్రీంకోర్టు వరకు వెళ్లినా..
వాస్తవానికి ఈ కేసులో ఉచ్చు తప్పదు అని భావించారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. అరెస్టు భయంతోనే ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఫలితం దక్కలేదు. న్యాయస్థానం జోక్యం చేసేందుకు నిరాకరించింది. మద్యం అక్రమ రవాణా వంటి తీవ్రమైన ఆర్థిక నేరాల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. తాము ఎలాంటి మద్యంతర రక్షణ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. ఆయనకు సంబంధించి న్యాయపరమైన ద్వారాలు అన్ని మూసుకుపోయాయి. ఈ అరెస్టుతో ఏపీ లిక్కర్ నెట్వర్క్, అక్రమ రవాణా దందా వెనుక కీలక సూత్రధారులుపై పట్టు బిగించినట్లు అయ్యింది.