AP Liquor Scam ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ చేపడుతోంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అరెస్టుల పర్వం ప్రారంభించింది. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కూడా రంగంలోకి దిగింది. దీంతో ఈ కేసు జాతీయస్థాయిలో కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అరెస్టుల పర్వం కూడా ప్రారంభం అయింది. రాజ్ కసిరెడ్డి తో ప్రారంభమైన అరెస్టుల పర్వం తర్వాత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల వరకు కొనసాగింది. అయితే దాదాపు అందరూ బెయిల్ పై విడుదల కాగా ఒక్క రాజ్ కసిరెడ్డి మాత్రం ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తాజాగా ఇన్కమ్ టాక్స్ సైతం రైడింగ్ ప్రారంభించింది.
* అంతా నగదు రూపంలోనే..
మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు నగదు రూపంలోనే జరిగాయి. డిజిటల్ పేమెంట్స్ అన్నమాట లేదు. అందుకే హవాలా మార్గాల్లో, షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున నగదు పక్కదారి పట్టించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది. అందుకే వారు సేకరించిన ప్రాథమిక ఆధారాలు, ఫోన్ రికార్డులు, స్వాధీనం చేసుకున్న హవాలా రసీదులు, రూ. 441 కోట్లకు పైగా అటాచ్ చేసిన ఆస్తుల సమాచారాన్ని ఐటి శాఖ విశ్లేషిస్తుంది. అప్రకటిత ఆదాయం, నగదు రూపంలో లంచాల సేకరణ వంటి అక్రమాల లక్ష్యంగా ఐటి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
* ఐటీ ఎంట్రీ తో..
నగదుకు సంబంధించిన అవకతవకలు భారీగా ఉంటేనే ఐటీ శాఖ రంగంలోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ శాఖ విచారణ ప్రారంభించడంతో మొదటగా అక్రమ లావాదేవీల వల్ల దాచిపెట్టిన బ్లాక్ మనీకి డిమాండ్ నోటీసులు జారీ అవుతాయి. డిస్టలరీలు నుంచి కేసుల వారీగా వసూలు చేసిన 15% నుంచి 20 శాతం కమీషన్లు, రవాణా శాఖ కాంట్రాక్టర్ల నుంచి పొందిన లంచాల నగదు పై సాధారణ పన్నుతోపాటు దాదాపు 60 శాతం నుంచి 78 శాతం వరకు పెనాల్టీతో కూడిన నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 269 ఎస్టి ప్రకారం రోజుకు లేదా ఒక్కో లావాదేవీ కి రెండు లక్షల రూపాయలకు మించి నగదు తీసుకున్నా, ఇచ్చినా అందుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. వేల కోట్ల రూపాయల క్యాష్ హ్యాండిలింగ్ జరిగింది కాబట్టి.. ఈ జరిమానాల వల్లే వేలకోట్లలోకి చేరుకునే అవకాశం ఉంది.
* బినామీలే టార్గెట్..
మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన అక్రమ నగదును రియల్ ఎస్టేట్, మైనింగ్, లగ్జరీ షోరూమ్స్, షెల్ కంపెనీ ల్లోకి మళ్లించేందుకు ఉపయోగించిన బినామీ పేర్లను ఐటీ శాఖ కచ్చితంగా టార్గెట్ చేస్తుంది. నిందితుల అనుచరులు, బంధువుల పేరుతో ఉన్న భూములు, రిసార్టులు, వ్యాపారులను కచ్చితంగా బినామీలుగానే గుర్తిస్తుంది. తనిఖీలు చేసి అవి బినామీ ఆస్తులుగా తేలితే ప్రాథమికంగా జప్తు చేసే అధికారం కూడా ఐటీ కి ఉంది.. ఐటి ఉచ్చు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరానికి కూడా అదే కారణం.