Jagan Mohan Reddy: నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు ఆ జిల్లాలో పనిచేస్తున్న పాత నాయకుల స్థానంలో కొత్తవారిని రంగంలోకి దించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే మాజీ మంత్రి అనిల్ కుమార్ కు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. గతంలో వైసీపీలో పని చేసిన చాలామంది నేతలు టిడిపిలోకి వెళ్లిపోయారు. ఉన్న నేతలను పక్కకు తప్పించి కొత్త నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా విజయం అందుకోవాలని జగన్ వ్యూహం. అందులో భాగంగా మరో మాజీ మంత్రిని ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. కోవూరు ఇన్చార్జిగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ని తప్పించి కొత్త జ్ఞాపక ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఆ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ప్రసన్న కుమార్ రెడ్డి పని చేయలేకపోతున్నారు అనేది ఒక వాదన. అందుకే మార్పు దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
* మొన్నటి ఎన్నికల్లో ఓటమి..
మొన్నటి ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని 54 వేల ఓట్ల తేడాతో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన నాటి నుంచి అక్కడ పట్టు బిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గట్టి నాయకురాలిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆమెను ఎదిరించేందుకు సరిపడా బలం ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద లేదు అనేది వైసిపి శ్రేణుల వాదన. క్షేత్రస్థాయిలో వైసిపి కార్యక్రమాలను నిర్వహించకుండా కేవలం ప్రశాంతి రెడ్డి పై విమర్శలకే ప్రసన్న కుమార్ రెడ్డి పరిమితం అవుతున్నారు అన్నది ఒక విమర్శ. సొంత పార్టీ శ్రేణులే ఆయన వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే బలమైన నేతను అక్కడ రంగంలోకి దించాలని జగన్ అన్వేషిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* సీనియర్ మోస్ట్ లీడర్..
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఫ్యామిలీ ఆది నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చింది. 1994లో తొలిసారిగా కోవూరు నుంచి పోటీ చేసి గెలిచారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఎన్టీఆర్ తన క్యాబినెట్లో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. 1999లో రెండోసారి గెలిచారు టిడిపి తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి. 2004లో మాత్రం ఓడిపోయారు. 2009లో మరోసారి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి కి దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. టిడిపికి గుడ్ బై చెప్పడమే కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బై పోల్ లో గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2024లో ప్రశాంతి రెడ్డి చేతుల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు పార్టీ పదవి కల్పించి నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..