Jagan And Modi: కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైసిపి. ఆ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఏర్పడింది. ఈ లెక్కన బిజెపికి దగ్గర కావాలి. కానీ వైసీపీ ఆవిర్భావ సమయంలో బిజెపి అధికారంలో లేదు. అప్పటికే బిజెపికి మిత్రపక్షంగా టిడిపి ఉంది. అయితే గత ఎన్నికలకు ముందు లెక్క మారింది. బిజెపికి మిత్రుడిగా ఉన్న చంద్రబాబు శత్రువయ్యారు. అప్పటివరకు న్యూట్రల్ గా ఉన్న జగన్ బిజెపికి మిత్రుడిగా మారారు. అప్పటినుంచి జగన్ తన స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అటు బిజెపి సైతం చాలా విషయాల్లో జగన్ అభ్యర్థన మేరకు ఏపీకి మినహాయింపు ఇస్తూ వచ్చింది.
గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలను తీసుకుంటే.. బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు అనేక రకాలుగా ప్రయత్నించారు. అదే సమయంలో టిడిపి మీడియా మాత్రం బిజెపి విధానాలను వ్యతిరేకించేది. వ్యతిరేకంగా కథనాలు రాసేది. ఇప్పటికీ టిడిపితో బిజెపి జతకట్టినా.. టిడిపి అనుకూల మీడియా మాత్రం ఆశించిన స్థాయిలో బిజెపికి సానుకూలత ప్రదర్శించడం లేదు. అయితే ఎప్పటి వరకు బిజెపి విషయంలో సానుకూలంగా ఉన్న సాక్షి మీడియా యూటర్న్ తీసుకోవడం విశేషం. వ్యతిరేక కథనాలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర రాజకీయాలను అనుసరించి జగన్.. బిజెపిని దూరం పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ కేంద్రంలో బిజెపికి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా.. ఏపీలో జగన్కు సీట్లు వచ్చినా.. అప్పుడు వైసీపీ అవసరం కీలకం. అదే జరిగితే జగన్ సైతం గేమ్ ఆడటం ఖాయం. అదే సమయంలో బిజెపికి కేంద్రంలో అనుకున్న సీట్లు వచ్చి.. ఏపీలో జగన్ ఓడిపోతే.. కేంద్రం సహకారంతో చంద్రబాబు జగన్ ను తొక్కేయడం ఖాయం. మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వచ్చి.. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే.. జగన్ పాత్రలోకి పవన్ రావడం ఖాయం. పవన్ ద్వారా బిజెపి రాజకీయం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రధాని మోదీకి.. సీఎం జగన్ దూరం జరిగినట్టు కనిపిస్తున్నారు. ఫలితాలను అనుసరించి.. ఈ దూరం మరింత పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది తెలియనుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More