YS Jagan Mohan Reddy: జగన్( Y S Jagan Mohan Reddy ) జిల్లాల పర్యటనలకు సిద్ధపడుతున్నారు. కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రజల మధ్యకు రావాలని భావిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. వాస్తవానికి గత ఏడాది సంక్రాంతికి ముందు జనంలోకి జగన్ వస్తారని వార్తలు వచ్చాయి. అయితే కూటమికి కనీసం రెండేళ్ల పాలనా గడువు ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్ వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు కూటమి రెండేళ్ల పాలన పూర్తయిన తరుణంలో.. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయిందని భావిస్తున్నారు. ఇదే సరైన సమయమని చెప్పి ప్రజల మధ్యకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు జగన్. తాడేపల్లి కి వచ్చి పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. జిల్లాల పర్యటనకు సంబంధించి ఒక నిర్ణయానికి రానున్నారు.
* కచ్చితంగా గెలవాల్సిందే..
వచ్చే ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాడోపేడో లాంటివి. కచ్చితంగా పార్టీ గెలవాల్సిందే. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే జిల్లాల పర్యటనల ద్వారా నియోజకవర్గాల స్థితిగతులు తెలుసుకోవడం, అక్కడ సరైన అభ్యర్థులను రంగంలోకి దించడం వంటి వాటిపై దృష్టి పెడతారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గ నుంచి ఒక వందమంది నేతల జాబితాను తయారుచేసి.. వారి నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే ఇది సాధారణ పర్యటనలా.. లేకుంటే బస్సు యాత్రల ద్వారా చేరువ కావాలా? అన్నది తేల్చాల్సి ఉంది. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలు మాత్రం పక్కా అని తెలుస్తోంది.
* ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం..
జగన్ తన జిల్లాల పర్యటనలను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పర్యటనలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లండన్ పర్యటనను ముగించుకొని జగన్ బెంగుళూరు చేరుకున్నారు. నిన్ననే ఓ వివాహ వేడుకలకు హాజరయ్యారు. తాడేపల్లి వచ్చి పార్టీ సీనియర్లతో సమీక్షిస్తారు ఇదే విషయంపై. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆ సమయానికి జిల్లాల పర్యటనలు మొదలు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే తాడేపల్లిలో సీనియర్ నేతలతో సమావేశం జరిగిన తర్వాత.. జగన్ జిల్లాల పర్యటనలకు ఒక క్లారిటీ రానుంది.