Jagan Political Crowd: జగన్( Y S Jagan Mohan Reddy ) జనహృదయనేత.. జనం అంటే జగన్.. జగన్ అంటే జనం.. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఆది నుంచి ఇంతే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుంది కూడా అదే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనం అవసరం ఎక్కువ. ఎందుకంటే ఆయన విపక్షంలో ఉన్నారు గనుక. మరోవైపు అధికారపక్షంగా ఉన్న చంద్రబాబు ఎటువంటి హంగామా లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎటువంటి జన సమీకరణ లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ జగన్ విషయంలో అలా లేదు. తప్పకుండా చుట్టూ జనం ఉండాల్సిందే. దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం జరుగుతోంది అదే. ఆయన ఎక్కడికి వెళ్తున్న జన సమీకరణకు ఇట్టే ఆదేశాలు వస్తున్నాయి. అయితే రాజకీయ కార్యక్రమాలకు హాజరైతే జన సమీకరణ చేయవచ్చు కానీ.. చివరకు వివాహానికి హాజరైన అదే స్థాయిలో జన సమీకరణ చేస్తుండడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా మారుతోంది.
Also Read: షర్మిలకు షాక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లు గా ఆ ఇద్దరు!
భారీ ఫ్లెక్సీలతో..
డోన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి( buggana rajendranath Reddy) కుమారుడు వివాహం నిన్ననే జరిగింది. డోన్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే అది పెళ్లి వేడుకో.. లేకుంటే రాజకీయ కార్యక్రమమో అన్నట్టు పరిస్థితిని మార్చేశారు. భారీ ఫ్లెక్సీలతో ఆ ప్రాంతాన్ని నింపేశారు. పుష్ప డైలాగులతో కూడిన ఫోటోలను అక్కడ ఏర్పాటు చేశారు. జనాలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. అయితే ఇక్కడ కూడా జన సమీకరణ చేయడమేనా అని సొంత పార్టీ శ్రేణులే విస్మయపడేలా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి డోన్ పర్యటన సందర్భంగా అడుగడుగునా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
భారీగా జన సమీకరణ..
డోన్ పట్టణంలోని( Don town ) దత్తాత్రేయ స్వామి ఆలయం వెనుక రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. ముందుగా హెలిప్యాడ్ నుంచి రిసెప్షన్ వేదికకు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. అయితే భారీ జన సమీకరణ చేయడంతో ఓ చోట తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దారు. అయితే జగన్ పర్యటన సామాన్య జనాలకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఈ వివాహ రిసెప్షన్ వేడుక ప్రాంగణం 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. జగన్ వచ్చిన సమయంలో పోలీసులు 20 నిమిషాల పాటు వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.
Also Read: టీటీడీ సంచలన నిర్ణయం!
రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..
అయితే జగన్మోహన్ రెడ్డి డోన్ పర్యటన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. దారి పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. తగ్గేదేలే.. రప్పా రప్పా సినిమా డైలాగులతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బైకుల మీద కొద్దిసేపు హల్చల్ చేశారు. రేషన్ వాహనాలతో రచ్చ చేశారు. అయితే వారి అత్యుత్సాహం సామాన్య జనాలకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది.