Indian Railways: మనదేశంలో రైలులో ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువే. దీంతో రైలు నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా.. కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా.. వెంటనే తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ప్రయాణికులకు అనుగుణంగా రైల్వే శాఖ సైతం ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఆర్ఏసీ ప్రయాణికుల కోసం బెడ్ రోల్ కిట్ ను అందజేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే..
రైలులో ప్రయాణం చేసేవారికి RAC (Reservation Against Cancellation) అనే పదం కొత్త కాదు. వెయిటింగ్ లిస్ట్ కంటే మెరుగైన రిజర్వేషన్ విధానం. ఇందులో ప్రయాణికుడికి సీటు కన్ఫామ్ అవుతుంది. అయితే పూర్తి బెర్త్ కాకుండా ఇద్దరు ప్రయాణికులకు ఒకే సైడ్ లోయర్ బెర్త్ కేటాయిస్తారు. ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఇతర ప్రయాణికులు టికెట్లు రద్దు చేస్తే ఖాళీ అయ్యే బెర్త్ను ఆర్ ఏసీ ప్రయాణికులకు కేటాయించే అవకాశం ఉంటుంది.
ఏసీ కోచ్లలో ప్రయాణించే ఆర్ ఏసీ ప్రయాణికులకు ఇద్దరికీ ఒకే బెర్త్ ఉన్నవారికి ఇప్పటి వరకు ఒకే బెడ్రోల్ కిట్ మాత్రమే అందించారు. దీంతో ఇద్దరూ అదే దుప్పటి, బెడ్షీట్ లేదా ఇతర వస్తువులను పంచుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో ప్రయాణించే సమయంలో ఇది అసౌకర్యంగా ఉండటమే కాకుండా పరిశుభ్రత, వ్యక్తిగత సౌకర్యం పరంగా కూడా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసేవారు.
ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇకపై ఇలా ప్రయాణించే ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా ఒక బెడ్రోల్ కిట్ అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో ఒకే బెర్త్ను పంచుకున్నప్పటికీ, బెడ్రోల్ విషయంలో ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఈ బెడ్ రోల్ కిట్ లో రెండు బెడ్షీట్లు, ఒక దిండు, దిండు కవర్, ఒక దుప్పటి, అవసరమైతే ముఖం తుడుచుకునే చిన్న టవల్ వంటి వస్తువులు ఉంటాయి. కొత్త నిర్ణయం ప్రకారం ఈ కిట్ను ప్రతి ప్రయాణికుడికి విడివిడిగా అందిస్తారు. దీంతో పరిశుభ్రత ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ అనుభవం కూడా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నిర్ణయంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో అపరిచితులతో బెడ్రోల్ పంచుకోవాల్సిన పరిస్థితి తొలగిపోవడం వల్ల మహిళలు, వృద్ధులు, కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది.