Sitting On Floor While Eating: ప్రస్తుతం చాలా మంది డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. వృద్ధుల నుంచి యువకుల వరకు దీనిపైనే కూర్చొని భోజనం చేస్తుంటారు. కానీ భారతీయ సంప్రదాయం ప్రకారం.. డైనింగ్ టేబుల్ వాడకుండా నేలపై కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యకరమైన అలవాటు అని అంటున్నారు. ముఖ్యంగా పద్మాసనంలో కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి, మనసుకు అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..
నేలపై పద్మాసనం కూర్చొని భోజనం చేసే సమయంలో శరీరం కొద్దిగా ముందుకు వంగి.. మళ్లీ నిటారుగా కూర్చునే కదలికలు జరుగుతాయి. ఈ కదలికలు కడుపు కండరాలను ఉత్తేజపరచి జీర్ణవ్యవస్థ పనితీరుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా భోజనం చేయడం వల్ల ఆహారం బాగా నమిలి తినే అలవాటు పెరిగి జీర్ణక్రియకు మరింత సహాయపడుతుంది.
నేలపై కూర్చొని భోజనం చేసే వారు సాధారణంగా నెమ్మదిగా ఆహారం తీసుకుంటారు. దీంతో మెదడుకు కడుపు నిండిందనే సంకేతాలు సమయానికి చేరుతాయి. ఫలితంగా అవసరానికి మించి తినే అవకాశం తగ్గుతుంది. ఈ అలవాటు బరువును నియంత్రించుకోవడంలో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల శరీరం సమతుల్య స్థితిలో ఉంటుంది. ప్రశాంతంగా భోజనం చేయడం, ఒత్తిడి తగ్గడం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు పరోక్షంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే నేలపై కూర్చొని తినేవారు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా కూర్చున్నప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచాల్సి ఉంటుంది. దీంతో వెన్నెముక కండరాలు, నడుము భాగం చురుకుగా పనిచేస్తాయి. మోకాళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు, ఆర్థరైటిస్, హిప్ జాయింట్ సమస్యలు ఉన్నవారు నేలపై కూర్చోవడం అసౌకర్యంగా అనిపిస్తే బలవంతంగా ప్రయత్నించకూడదు. అలాగే వృద్ధులు వైద్యుల సూచన మేరకు మాత్రమే ఈ అలవాటును పాటించడం మంచిది.