India Tax System: భారతదేశంలో ప్రజలు కొన్ని వస్తువుల వినియోగంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే ఈ పనులతోనే ప్రభుత్వం రకరకాల చెల్లింపులు చేస్తుంది. అయితే దేనికి ఎంత వెచ్చిస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది. కొందరు నిపుణుల ప్రకారం.. మనం చెల్లించే చెల్లించే ఆదాయపు పన్నుతో రక్షణ, విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు, రాష్ట్రాలకు నిధులు, అప్పులపై వడ్డీ చెల్లింపులు ఉంటాయి. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. విద్య, ఆరోగ్యంపై అతి తక్కువగా ఖర్చు చేస్తున్నారు.. ఆ వివరాలు లోకి వెళ్తే..
ప్రతి రూ.100 లో ప్రభుత్వ ఖర్చు ఎలా ఉంటుందంటే?
ఉదాహరణకు మనం చెల్లించే పన్నుల్లో ప్రభుత్వం ప్రతి వంద రూపాయల్లో ఎలా ఖర్చు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.. ప్రతి వంద రూపాయల్లో.. రూ.20 నుంచి 25 వరకు గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీకి చెల్లిస్తారు.. రూ.15 నుంచి రూ.20 వరకు రాష్ట్రాలకు వాటాలు చెల్లిస్తారు. రక్షణ రంగానికి రూ.10 నుంచి వరకు వెచ్చిస్తారు. సబ్సిడీలు, సంక్షేమ పథకాలు కోసం రూ.6 కేటాయిస్తారు. అయితే విద్య కోసం రూ.2.6… వైద్యం కోసం రూ. 2.. పరిశోధనల కోసం రూ.1 కేటాయిస్తారు. మిగతావి వ్యవసాయం, పరిపాలన, ఇతర శాఖలపై ఖర్చవుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వీటిపై బడ్జెట్ మారుతుంది.
అప్పులపై వడ్డీకే పెద్ద వాటా..
కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులో అత్యధిక భాగం గతంలో తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లించడానికే వెళ్తుంది. పైన తెలిపిన ప్రకారం ప్రతి 100 రూపాయల్లో రూ. 22 లెక్కన చెల్లిస్తారు. ప్రభుత్వానికి ఉన్న భారీ రుణాల కారణంగా ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది.
రక్షణ రంగానికి సైతం..
దేశ భద్రత కోసం సైన్యం, నౌకాదళం, వైమానిక దళం నిర్వహణ, ఆయుధాల కొనుగోలు, సరిహద్దు భద్రత, సైనికుల సంక్షేమం వంటి అవసరాలకు సైతం కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుంది. ప్రపంచ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ రంగానికి ప్రతి సంవత్సరం గణనీయమైన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి.
విద్య, ఆరోగ్య రంగాలకు తక్కువే..!
ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, పరిశోధన, వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య పథకాలు, టీకా కార్యక్రమాలు వంటి వాటికి కూడా బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి. అయితే మిగతా వాటికంటే వీటికి కేటాయింపులు తక్కువగానే ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఈ రంగాలపై ప్రభుత్వం నిరంతరం పెట్టుబడులు పెడుతోంది.
రాష్ట్రాలకు నిధుల బదిలీ
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ఒక భాగాన్ని ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పంచుతుంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం కూడా రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తుంది. దీంతో రాష్ట్రాలు విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాయి.
ప్రజలు చెల్లించే పన్నులు కేవలం ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకే కాదు. దేశ భద్రత, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, పేదల సంక్షేమ పథకాలు, రాష్ట్రాల అభివృద్ధి, అప్పుల చెల్లింపులు వంటి అనేక రంగాలకు వినియోగిస్తారు. అందువల్ల పన్నులు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన ఆధారంగా భావిస్తున్నందున ప్రభుత్వానికి సరైన విధంగా పనులు చెల్లించాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.