Jagan changing mind: రాజకీయాలు( politics) ఎప్పుడూ ఒకేలా ఉండవు.. పరిస్థితులకు తగ్గట్టు మారుతుంటాయి. అందుకు తగ్గట్టుగా నేతలు కూడా మారాలి. ఇప్పుడు జగన్ విషయంలో అదే పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో టీడీపీ కూటమిలో బిజెపి ఉంది. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలో టిడిపి భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గతం మాదిరిగా తటస్థ వైఖరి ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి తాగదు. 2024 ఎన్నికలకు ముందు ఒకలా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమి అండ జగన్మోహన్ రెడ్డికి అవసరం. మునుపటిలా ఒంటరి పోరాటం.. తటస్థ వైఖరి అనే మాట కుదరదు. అయితే ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడిప్పుడే అర్ధమైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇతర పార్టీల నేతలను.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసేందుకు ఎంత మాత్రం అంగీకరించేవారు కాదు. కానీ ఇప్పుడు పలకరింతలతో పాటు సన్నిహితంగా గడుపుతున్నారు వారితో. నిన్న తమిళనాడులో పదే పరిస్థితి కనిపించింది.
వివాహ వేడుకల్లో..
వైయస్ కుటుంబానికి చెందిన ఓ వివాహ వేడుక చెన్నైలో( Chennai) జరిగింది. ఆ వేడుకకు ముందుగానే హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఒక వివాహ వేడుకలో అంతలా గడపడం అరుదు. అయితే అది సొంత కుటుంబానికి చెందినది కావడంతోనే జగన్ అలా చేసి ఉండవచ్చు. కానీ అక్కడ గడిపిన క్షణాలు, ఆయనను కలిసిన నేతలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ వైఖరి మారినట్టు కనిపిస్తోంది. దాదాపు ఇండియా కూటమిలోని నేతలంతా జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న కీలక నాయకుడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. ఆయన సైతం జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. కొత్త పార్టీ అధినేత విజయ్ సైతం వచ్చారు. ఆయన సైతం ఎన్డీఏ కు దూరంగా ఉన్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ జాతీయ నాయకుడు చిదంబరం సైతం వచ్చి కలిసారు. జగన్ తో కొంతసేపు భేటీ అయ్యారు. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారుతున్నట్లు స్పష్టం అవుతోంది.
కెవిపి రామచంద్రరావు తో సైతం..
వైయస్ కుటుంబ కార్యక్రమం కావడంతో ఆయన ఆత్మగా భావించే కెవిపి రామచంద్రరావు( KVP Ramchandra Rao ) సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సన్నిహితుడిగా భావించే కెవిపి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఆయనతో బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గడిపిన సందర్భాలు లేవు. కానీ ఈ పెళ్లి వేడుకకు కెవిపి రామచంద్రరావు హాజరు కాగా.. హౌ ఆర్ యు అంకుల్ అంటూ పలకరించారు జగన్. ఒకవైపు వారంలో నాలుగు రోజులపాటు బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీలైనంత వరకు రాజకీయ ప్రశాంతత అక్కడ లభిస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు చెన్నైలో సైతం కాంగ్రెస్ తో పాటు కూటమి పార్టీల నేతలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం, సన్నిహితంగా మెలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏదో జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.