Pawan Kalyan : ముద్రగడకు నిద్ర పట్టడం లేదు.ఆయన తెల్లవారు లేచింది మొదలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు.ప్రెస్ మీట్ అయినా, సభ అయినా, అంతర్గత సమావేశం అయినా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వైసీపీలోకి రప్పించి ముద్రగడకు అదే టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో ముద్రగడ పోటీ చేయడం లేదు కానీ.. పవన్ పై ఆయనే పోటీ చేస్తున్నారన్న రేంజ్ లో ముద్రగడ మాట్లాడుతున్నారు.అయితే తనను జనసేనలోకి ఆహ్వానించి అవమానపరిచారని ఇదివరకు చెప్పుకున్న ముద్రగడ.. అదే కారణంతో కాబోలు పవన్ ను గుర్తు చేస్తేనే ఊగిపోతూ మాట్లాడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాస్తవానికి ముద్రగడ జనసేన వైపు మొగ్గు చూపారు. జనసేనలో చేరితే.. పొత్తులో భాగంగా ఈజీగా సీటు దక్కించుకొని యాక్టివ్ రాజకీయాలు చేయవచ్చని భావించారు. పవన్ నుంచి దూతలు వచ్చి ఆహ్వానించేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. అక్కడి పెద్దలతో సైతం అమర్యాదగా మాట్లాడారు. అయితే పవన్ నేరుగా వచ్చి ఆహ్వానిస్తారని వేచి చూశారు. రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలు అయ్యాయి. కానీ పవన్ పట్టించుకోలేదు. వైసీపీ ఇచ్చిన ఆఫర్ దక్కలేదు. చివరకు గత్యంతరం లేని స్థితిలో ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చింది. అంతకంటే ముందు జనసేనలోకి వెళ్తామని స్వయంగా ముద్రగడ కుమారుడు చెప్పేసరికి.. ఇప్పుడు వైసీపీలో చేరిన అంత మర్యాద దక్కడం లేదు. పవన్ ఎంత స్ట్రాంగ్ గా తిడితే.. వైసీపీలో అంత మర్యాద దక్కే అవకాశం ఉండడంతో.. వేదిక ఏదైనా ముద్రగడ వదలడం లేదు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు అమర్యాదగా మాట్లాడుతున్నారు.
తాజాగా తణుకులో జరిగిన కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో అయితే పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ముద్రగడ. చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్ గా అభివర్ణించారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కాపులను కోరారు. సినిమా షూటింగ్స్ గ్యాప్ లో వచ్చి రాజకీయాలు చేసే వారికి ఓట్లు వేయొద్దని కోరారు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించాలని పిలుపునిచ్చారు. పేకాట క్లబ్బులు నడిపే వారితో పవన్ కళ్యాణ్ తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు కోట్లు ఖర్చు పెడుతున్నారని చెబుతున్న ఆయన.. రెండు లక్షల మెజారిటీతో ఎలా గెలుస్తానని చెబుతున్నారని ముద్రగడ ప్రశ్నించారు. అటు చంద్రబాబును ముద్రగడ విడిచిపెట్టలేదు. ఎవరైనా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెబుతారని.. చంద్రబాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పడం అమానుషమన్నారు. 2024 ఎన్నికల్లో ఆ ఇద్దరికీ ఏపీ రాష్ట్ర ప్రజలు ప్యాకప్ చెబుతారని కూడా తేల్చి చెప్పారు. అయితే పిఠాపురం వచ్చి ప్రచారం చేయాల్సిన ముద్రగడ.. ఎక్కడో తణుకులో ఉండి కాపులకు ఎడ్యుకేట్ చేస్తుండడం విశేషం. అయితే ఆయన ఎంత కష్టపడి కూటమి వైపు కాపులను వెళ్లకుండా చేస్తే.. జగన్ నుంచి అంతలా ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. అందుకే ఆయన వ్యక్తిగత విమర్శలు చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.