HomeతెలంగాణRevanth Reddy : పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఓట్ల...

Revanth Reddy : పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఓట్ల పంట పండినట్టే

Revanth Reddy : “అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసింది. ఒక గ్యారెంటీ అయినా ఇప్పటివరకు అమలు చేసిందా? వంద రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలేదు.. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగడతాం.. అడుగడుగునా ఇబ్బంది పెడతాం” ఇలా భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హడ్కో శుభవార్త చెప్పింది. ఈ శుభవార్త అలాంటి ఇలాంటిది కాదు. ఆరు గ్యారంటీల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

3000 కోట్లకు ఓకే..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం 3,500 ఇళ్ళ చొప్పున సంవత్సరానికి 4.5 లక్షల ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఈ పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సంవత్సరానికి 4.5 లక్షల ఇళ్ళు మాత్రమే కాదు.. రాష్ట్ర రిజర్వు కోట కింద 33,500 కేటాయించింది.. అయితే ఈ పథకానికి భారీగా నిధుల అవసరం ఉన్న నేపథ్యంలో.. రుణాలు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో గృహ నిర్మాణ సంస్థకు 3000 కోట్ల రుణం అందించేందుకు హడ్కో ఓకే చెప్పింది. పార్లమెంట్ ఎన్నికలు మూసిన తర్వాత ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.. ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని భావిస్తున్న నేపథ్యంలో నిధుల కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా..

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కేంద్రం నుంచి కూడా ఆ మొత్తాన్ని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర అధికారులు ఐదువేల కోట్ల రుణానికి హడ్కో కు ప్రతిపాదనలు పంపారు. ఆ మధ్య భద్రాచలంలో ఈ పథకాన్ని లాంఛనంగా మాత్రమే ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే నిన్న మొన్నటి వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడం.. గత ప్రభుత్వం పంపిన రుణ ప్రతిపాదనలు కూడా ఉండడంతో హడ్కో ప్రాథమికంగా మూడు వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ రుణంలో భాగంగా మొదటి దశలో 850 కోట్లు విడుదల చేయనుంది.

గత ప్రభుత్వ హయాంలో పూర్తికాలేదు

ఇక గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని చేపట్టిన సంగతి విదితమే. నిధులు లేకపోవడంతో.. అప్పట్లో కొన్ని డబుల్ రూం ఇళ్ళ నిర్మాణ పనులను ప్రభుత్వం చివరి దశలో నిలిపివేసింది. వెయ్యి కోట్లు రుణం తీసుకొని ఆ పనులు పూర్తి చేయాలని భావించింది. అప్పట్లో హడ్కో కు ప్రతిపాదనలు కూడా పంపింది. శాసనసభ ఎన్నికల సమయం వరకు ఆ రుణం మంజూరు కాలేదు. శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఓడిపోవడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. మునుపటి ప్రభుత్వ రుణ ప్రతిపాదనకు తాజాగా ఆమోదం తెలిపింది. అయితే ఆ నిధులతో నిలిచిపోయిన పనులు మొత్తం పూర్తి చేసి.. పెండింగ్ లో ఉన్న బిల్లులు మొత్తం చెల్లించే ఆలోచనలో ప్రభుత్వ ఉంది. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు హడ్కో రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో.. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వానికి దాదాపుగా ఇళ్ల ఇబ్బందులు తప్పినట్టేనని.. ఇది మాకు ఓట్ల పంట పండిస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular