Chandrababu: చంద్రబాబుకు కాన్ఫిడెన్స్ పెరిగిందా? అందుకే 160 సీట్లను గెలుస్తామని చెబుతున్నారా? చంద్రబాబులో ఈ ధీమా పెరగడానికి కారణం ఏంటి? సర్వే ఫలితాలా? లేకుంటే కేంద్రం నుంచి సమాచారం ఉందా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీ నుంచి గెలుస్తామన్న మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. క్యాడర్లో ధైర్యం, ఉత్సాహం నింపేందుకుఈ తరహా మాటలు చాలా అవసరం. అయితే చంద్రబాబు ఏకంగా 160 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెప్పడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడు పార్టీ శ్రేణులను అలెర్ట్ చేసే క్రమంలో చంద్రబాబు అధిక ప్రకటనలు చేయరు. కానీ పోలింగునకు ముందు ఈ భారీ ప్రకటన చేయడం మాత్రం వ్యూహంగా తెలుస్తోంది.
ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కానీ సంక్షేమ పథకాలతో ఈ ఓటమిని అధిగమించి గెలుపు బాట పడతామని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వైసీపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఐదేళ్లుగా ఆ రెండు వర్గాలు బాధితులుగా మిగిలారు. అందుకే కసితో పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో లక్షన్నర దరఖాస్తులు రాగా.. ఈసారి ఐదు లక్షలు రావడం విశేషం. కేవలం జగన్ను గద్దతించాలన్న కృత నిశ్చయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని తేలింది.
మరోవైపు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నతశ్రేణి వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. పట్టణ, నగర ప్రాంత ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారు. నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థులు సైతం జగన్ సర్కార్ చర్యలను తప్పుపడుతున్నారు. మరోవైపు కూటమిలో సీట్ల సర్దుబాటు, నేతల్లో అసంతృప్తిని తగ్గించడం, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో పాజిటివ్ వైబ్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన అమిత్ షా ప్రధాన అనుచరుడు ఒకరు బాహటంగానే ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని.. జూన్ 9న సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని.. కేంద్రం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని కూడాతేల్చి చెప్పారు.ఈ పరిణామాల క్రమంలోనే చంద్రబాబులో ధీమా పెరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.