Pawan Kalyan: పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు.గత కొంతకాలంగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో పవన్ విశాఖలోని గాజువాక తో పాటు భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది నియోజకవర్గాల్లో పోటీచేయాలని స్థానిక జనసేన వర్గాలు పవన్ ను కోరుతూ వచ్చాయి.అందుకే ఈసారి తనకు అనువైన నియోజకవర్గాలను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. కానీ ఓటమి ఎదురైన చోటే గెలుపొందాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గాజువాక తో పాటు భీమవరం నియోజకవర్గంలో మరోసారి బరిలో దిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు పవన్ గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ తాజాగా గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తన పోటీపై స్పష్టతనిచ్చారు.
కాకినాడ,పిఠాపురం భీమవరం,గాజువాక, తిరుపతి, అనంతపురం తదితర నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట పవన్ పోటీ చేస్తారని గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో… పవన్ ఎక్కడ పోటీ చేసినా గెలుపు తధ్యం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని.. మధ్యలో బిజెపి ఎంట్రీ తో ఆగిందని.. మరో రెండు మూడు రోజుల్లో పొత్తు ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాలను పవన్ కలవనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో స్పష్టతనిచ్చారు. మరోసారి తాను భీమవరంలో పోటీ చేస్తానని జనసేన, టిడిపి నేతలతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈరోజు భీమవరంలో ఇరు పార్టీల శ్రేణులతో సమావేశమైన పవన్ సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి, జనసేన ఒంటరిగా పోరాటం చేయడంతో వైసిపికి విజయం దక్కింది. ఆ ఎన్నికల్లో పవన్ రెండో స్థానంలో నిలిచారు. రెండు పార్టీల ఓట్లు కలిపితే భారీ విజయం నమోదయ్యే పరిస్థితి ఉంది. అందుకే పవన్ భీమవరం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై పవన్ చంద్రబాబు తో మాట్లాడారని… ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే పవన్ ఈ విషయంలో పూర్తి స్పష్టత తీసుకున్నక.. రెండు పార్టీల నేతలను కలుసుకొని సహకరించాలని కోరారని తెలుస్తోంది.