Chandrababu: చంద్రబాబులో స్పష్టమైన వైఖరి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రజలతో మమేకం అవుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది. ప్రతిపక్షాలు అది ప్రచార స్టంట్ అంటున్నాయి. ఎందుకంటే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి. తాజాగా ఆయన ఓ మత్స్యకారుడు ఇంటికి వెళ్లి.. వారితో కలిసి భోజనం చేసిన తీరు మాత్రం చాలా ఆకట్టుకుంటోంది. ఈసారి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు మాత్రం కనిపించింది. ఎప్పుడు పాలన, కొత్త ఆవిష్కరణలు, విజన్లు అంటూ హడావిడి చేసే ఆయన.. ఈసారి మాత్రం సామాన్య జనాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఒక సాధారణ ఆటో డ్రైవర్ తో మాటామంతి, కిరాణా షాప్ నడుపుకునే చిరు వ్యాపారితో సంభాషణ, ఒక చిన్న కుటుంబంతో మాట్లాడుతున్న తీరు, ప్రతి నెల పింఛన్ ఇచ్చేందుకు సామాన్యుడు చెంతకు వెళ్తున్న తీరు చూస్తుంటే మాత్రం.. ఆయన వైఖరిలో మార్పు గమనించాలి.
* ప్రతిపక్షం విమర్శలు..
అయితే చాలామంది చంద్రబాబు చేస్తున్న పనిని ప్రచార ఆర్భాటంగా చెబుతున్నారు. ఆయన రహస్యంగా ఏ పని చేయలేరు. ప్రోటోకాల్ ప్రకారం మీడియా ఉంటుంది. భద్రత ఉంటుంది. పైగా సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా యాక్టివ్ గా ఉన్న రోజులు. ఎప్పటికప్పుడు ఈ విషయాలు బయటపడక తప్పదు. దానిని ప్రచార కోణంలో చూస్తామంటే కుదరదు. అయితే విపక్షాలు ఎలాను విమర్శిస్తాయి. కానీ చంద్రబాబు వైఖరిని గమనించిన వారు మాత్రం గుర్తించగలరు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇలానే ప్రజలతో మమేకమైనప్పుడు ఆయనతో చంద్రబాబును పోల్చి విమర్శలు చేసేవారు. ఇప్పుడు అదే చంద్రబాబు అలా చేస్తుంటే ప్రచార ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు.
* పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ సాయం
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అంటే ముందుగా గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు చంద్రబాబు పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో.. బాధితులకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి అందుతోంది. ఏ అవసరానికి చెయ్యి చాచిన ముఖ్యమంత్రి తన సహాయ నిధి నుంచి సాయం అందిస్తున్నారు. ఒకవైపు సామాన్యులతో మమేకం అవుతున్న తీరు కూడా ఆకట్టుకుంటుంది. పరిణితి చెందిన నాయకుడిగా చంద్రబాబు ఆవిష్కృతం అవుతున్నారు.
