Balineni Vs Damacharla: ప్రకాశం జిల్లా లో రాజకీయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నా సరే.. ఇక్కడ మాత్రం రాజకీయాలు సానుకూల ధోరణిలో కొనసాగుతాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అక్కడ వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన, టిడిపి నేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి.
ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన నాయకుడిగా సాగుతున్నారు. గతంలో ఈయన వైసిపిలో ఉండేవారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేనలోకి వచ్చారు. ఒంగోలులో టిడిపి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్ధన్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డికి .. జనార్ధన్ కు విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో జనార్దన్ ను శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేసుకున్నారు. అవినీతి ఆరోపణ చేయడం మొదలుపెట్టారు. మొన్నటిదాకా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఇప్పుడు ఏకంగా కరపత్రాలు ఆ తర్వాత వీధి పోరాటం వరకు వచ్చేసింది.
జనార్ధన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నారని.. బార్ నుంచి మొదలుపెడితే మైనింగ్ వరకు దేనిని వదిలిపెట్టడం లేదని శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. జనార్ధన్ మీద కరపత్రాలు విడుదలయితే తమ అనుచరుల పేర్లు చెబుతున్నారని.. కేసులు కూడా పెడుతున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. డ్వాక్రా రుణాలు.. రాజుపాలెం రొయ్యల చెరువుల ఆక్రమణలు.. ఇసుక డబ్బులు.. ఇలా ప్రతి వ్యవహారంలో జనార్ధన్ హస్తం ఉందని.. దీని వెనక జరుగుతున్న వ్యవహారాలను ప్రభుత్వం గుర్తించి విచారణ జరిపించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అనుచరులను కాపాడుకోకపోతే తన రాజకీయ జీవితం వ్యర్థమని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇకపై వారంలో నాలుగు రోజులపాటు ఒంగోలులోనే ఉంటానని.. ప్రజా సమస్యల మీద పోరాటం సాగిస్తానని శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు.
మరోవైపు ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే జనార్ధన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి కూటంలో ఉన్నారు కాబట్టి ఇన్నాళ్లపాటు తాము నిశ్శబ్దంగా ఉన్నామని.. ఆయన ఎప్పుడో ఒకసారి ఒంగోలు వస్తారని.. ఏవో విమర్శలు చేసి వెళ్లిపోతారని.. అవాస్తవాలను చెబుతుంటారని జనార్ధన్ పేర్కొన్నారు. కరపత్రాల వ్యవహారం వెనుక ఉన్నది మురళి అని.. ఆయన శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు అని జనార్దన్ చెబుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి చేసిన అక్రమాలపై.. ఒకవేళ కరపత్రాలు పంచాలి అనుకుంటే అవి సరిపోవని.. ఒక పుస్తకం రాయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒంగోలు లో కూటమి నేతల మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.