Chandrababu : ఏపీలో ( Andhra Pradesh) మరో ఎన్నికకు నగారా మోగింది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నిక జరగనుంది. కూటమి స్పష్టమైన మెజారిటీతో ఉండడంతో వారికి ఐదు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. అయితే మూడు పార్టీల్లో ఆశావహులు అధికంగా ఉన్నారు. దీంతో మూడు పార్టీలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే జనసేనకు ఒకటి ఇస్తారా? రెండు ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అటు బిజెపి సైతం ఒక ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిశారు. దాదాపు గంట పాటు సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
* నాగబాబుకు ఖాయం
ఇప్పటికే జనసేనకు( janasena ) ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయం అని తేలిపోయింది. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనివార్యం. కొద్ది నెలల కిందట నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే నాగబాబు ఏ సభల్లోనూ సభ్యుడు కాదు. అందుకే ఎమ్మెల్సీగా చేసి తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అందుకే జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తే మాత్రం అది నాగబాబుకు మాత్రమే. అయితే జనసేనకు మరో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది.
Also Read : ఏపీలో ఆ మూడు పథకాలపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు
* బిజెపిలో ఆయనకు చాన్స్
మరోవైపు బిజెపి( BJP) సైతం ఒక పదవి కోరుతోంది. ఆ పార్టీ నుంచి ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకోవైపు విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు సోము వీర్రాజు లాంటి నేతలు ఎమ్మెల్సీ పదవిని కోరుతున్నారు. కానీ టిడిపి తో సమన్వయం చేసుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. అప్పట్లో సోము వీర్రాజు టిడిపి తో పొత్తును వ్యతిరేకించారు. అందుకే ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న పివిఎన్ మాధవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* టిడిపిలో ఆశావహులు
ఇంకోవైపు తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) ఆశావహులు అధికంగా ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. అటువంటి వారిలో పిఠాపురం వర్మ, దేవినేని ఉమా వంటి నేతలు ఉన్నారు. పవన్ గెలుపు కోసం వర్మ పనిచేశారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అది ఆయనకు మైనస్ గా మారింది. మరోవైపు వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకోవైపు బీద రవిచంద్ర యాదవ్ సైతం ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు గంట పాటు సమావేశం అయిన ఆ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Also Read ; జనంలోకి జగన్.. ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!