Bill Gates with Chandrababu: ఎక్కడైనా ప్రపంచ దిగ్గజ ప్రముఖులను పాలకులు కలుస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates) ఏపీకి వస్తున్నారు. ఆయనను కలిసేందుకు అమెరికా వెళ్ళాలి కానీ.. ఇప్పుడు ఆయనే వస్తుండడం నిజంగా విశేషమే. ఈనెల 16న బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు. పలు కీలక అంశాలపై వారిద్దరూ సమీక్షిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఇప్పటికే బిల్ గేట్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దాని గురించి చర్చించేందుకు బిల్ గేట్స్ ఇప్పుడు ఏపీకి వస్తున్నట్లు సమాచారం.
* కీలక చర్చలు..
ఏపీ ప్రభుత్వం( AP government) ఇప్పటికే చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తోంది. రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ రికార్డులను బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో తయారు చేయనున్నారు. ఈ అంశాలన్నింటిపై బిల్ గేట్స్ చంద్రబాబుతో చర్చించనున్నారు. మరోవైపు అమరావతి రాజధాని లో క్వాంటం వ్యాలీలో పెట్టుబడులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పాటు క్వాంటం వ్యాలీకి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఆ రెండు అంశాలలో బిల్ గేట్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో ఐటీ రంగానికి ఇది ఎంతగానో దోహదపడనుంది. ఏపీ స్వరూపమే మారనుంది.
* పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో
ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు( CM Chandrababu) 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో బిల్ గేట్స్ ను కలిసేందుకు వెళ్లారు. అతి కష్టం మీద ఆయన అపాయింట్మెంట్ లభించింది. అది కూడా స్వల్ప వ్యవధి మాత్రమే. ఆ సమయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. దానికి ముగ్ధుడయ్యారు బిల్ గేట్స్. అప్పటినుంచి చంద్రబాబును అభిమానించే వ్యక్తిగా మారిపోయారు బిల్ గేట్స్. చంద్రబాబు విన్నపం మేరకు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం ఐటి హబ్ గా మారేందుకు ఆ నిర్ణయం ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు వారి మధ్య అనుబంధం ఏపీ అభివృద్ధికి కూడా నాంది పలికే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?