Bhogapuram International Airport: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ తీరనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో విమానయాన వసతులు, పర్యాటకం, వాణిజ్యం తో పాటు ఇతర రంగాల్లో అభివృద్ధికి బీజం పడింది. వచ్చే 50 ఏళ్లకు అవసరమైన మౌలిక వసతులను ఈ విమానాశ్రయంలో కల్పించారు. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడుతుంది. సరిగ్గా ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో అడుగు పెడతారు ప్రధాని నరేంద్ర మోడీ. 1:10 గంటల వరకు ఎయిర్పోర్టులోనే గడపనున్నారు.
దాదాపు రెండున్నర గంటలపాటు షెడ్యూల్ ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీ ది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. 13వేల మంది గిరిజన కళాకారులతో ధింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 200 మంది విద్యార్థుల కూచిపూడి ప్రదర్శనతో ప్రధానిని స్వాగతం పలకనున్నారు. రెండు లక్షల మంది జనాభాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. 5000 బస్సుల ఏర్పాటుతో పాటు బందోబస్తు విధుల్లో ఏడు వేల మంది పోలీసులు పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులతో పాటు యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. ఉత్తరాంధ్రలో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీని గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలకనున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం గత వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షించింది.
* మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన షెడ్యూల్ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు ఈ విమాన షెడ్యూల్ విడుదలైంది. ప్రతిరోజు హైదరాబాద్- భోగాపురం మధ్య ఐదు సర్వీసులు, బెంగళూరు- భోగాపురం మధ్య రెండు సర్వీసులు, విజయవాడ- భోగాపురం మధ్య నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. భోగాపురం- బెంగళూరు మధ్య ఆది, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజులు మరో సర్వీస్ అదనంగా అందుబాటులో ఉంటుంది.