Avinash Reddy: కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర కుటుంబానిది. 1978లో ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు ఇప్పటివరకు ఆ కుటుంబం కడప జిల్లాలో తనకంటూ ఒక రాజకీయ ముద్ర చాటుకుంటూ వచ్చింది. పులివెందులలో మొదలైన ప్రాబల్యం కడప జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. 2019 ఎన్నికల వరకు ఆ కుటుంబ హవా కొనసాగింది. 2024 ఎన్నికల్లో మాత్రం దూకుడుకు బ్రేక్ పడింది. 10 అసెంబ్లీ సీట్లకు గాను జగన్ పార్టీకి మూడు స్థానాలు మాత్రమే రావడంతో ఆ కుటుంబ హవా తగ్గినట్లు స్పష్టమైంది. అందుకే అక్కడ నాయకత్వం మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కుటుంబంలో పోరు, వివేకానంద రెడ్డి హత్యకేసు అంశం వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే అక్కడ నాయకత్వ బాధ్యతలు నుంచి తప్పుకుంటానని అవినాష్ రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
* అంతా వివేకానంద రెడ్డి..
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదిగేందుకు కుటుంబమంతా అండగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యుల్లో యాక్టివ్ గా ఉన్నది మాత్రం వివేకానంద రెడ్డి. కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు కానీ.. రాజశేఖర్ రెడ్డి మాత్రం సోదరుడు వివేకానంద రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే ఎంపీగా వివేకానంద రెడ్డిని నిలిపేవారు. ఎంపీగా పోటీ చేస్తే పులివెందుల నుంచి బరిలో దింపేవారు సోదరుడిని. అంతలా వారి మధ్య బంధం ఉండేది. రాష్ట్ర రాజకీయాలను రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారు. పులివెందులతోపాటు కడప జిల్లా బాధ్యతలను వివేకానంద రెడ్డి చూసేవారు. అన్నమాట జవదాటని వ్యక్తి వివేకానంద రెడ్డి.
* తగ్గిన ప్రాధాన్యం..
అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆ కుటుంబంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడారు వివేకానంద రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెంట రాజకీయంగా అడుగులు వేసిన క్రమంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పులివెందులతోపాటు కడప నాయకత్వం వివేకానంద రెడ్డికి కాకుండా అవినాష్ రెడ్డి కుటుంబానికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. మరోవైపు వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో సెంటిమెంట్ పరంగా అది జగన్మోహన్ రెడ్డికి లభించింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. పూర్తిగా మైనస్ అయ్యింది వివేకానంద రెడ్డి హత్య అంశం.
* మారిన పరిస్థితులతో..
ప్రస్తుతం కడప జిల్లాతో పాటు పులివెందుల బాధ్యతలు చూస్తున్నారు అవినాష్ రెడ్డి. అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు వెంటాడుతూనే ఉంది. రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఆ కారణంగానే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ అవుతోంది. ఇంకోవైపు పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే కడప జిల్లా బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం ఆ విషయంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.