AP Rajya Sabha Elections: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. జూన్లో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. వారు ఎన్నికకు సంబంధించి ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. పదవీ విరమణ చెందుతున్న సభ్యుల్లో ముగ్గురు వైసీపీకి చెందినవారు. మరొకరు టిడిపికి చెందినవారు. అయితే ఈ నాలుగు సీట్లు కూటమి ఖాతాలో పడనున్నాయి. ఎందుకంటే ఏపీలో కూటమికి ఏకపక్ష బలం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ గెలుచుకునే అవకాశం లేదు. అయితే మూడు పార్టీల్లో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. దీంతో సమీకరణల దృష్ట్యా ఎవరికి ఛాన్స్ దక్కుతుందా అన్నది చూడాలి.
* నలుగురు పదవీ విరమణ..
ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, టిడిపికి చెందిన సనా సతీష్ జూన్ లో పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో సతీష్ ఏడాదిన్నర కిందట రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. అప్పట్లోనే ఆయనకు కొనసాగింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయనకు మరోసారి పదవి దక్కే ఛాన్స్ ఉంది. మిగతా మూడు పదవులను మూడు పార్టీలు సమానంగా పంచుకోనున్నాయి. టిడిపి నుంచి ఆశావహులు ఎక్కువమంది ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపి విషయంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడు కు చెందిన అన్నామలైకు రాజ్యసభ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్ నడిచింది. కానీ తమిళనాడులో బిజెపికి అనుకున్న ఫలితాలు రాకపోవడంతో హై కమాండ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణకు చెందిన నేతకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి.. 2028లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
* గతసారి కృష్ణయ్యకు..
గతసారి కూడా తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు చాన్స్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్యకు చాన్స్ ఇవ్వగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు కృష్ణయ్య. మళ్లీ ఆయనకు బిజెపి తరఫున ప్రమోట్ చేయడం ద్వారా తెలంగాణలో బీసీల మనసు గెలవాలన్నది బిజెపి ప్రణాళిక. అయితే మరోసారి ఇప్పుడు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం అధికం. పైగా వర్గీకరణ చేయడం ద్వారా మాదిగలకు దగ్గర అయింది బిజెపి. ఇప్పుడు కృష్ణమాదిగకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనాలని భావిస్తోంది. అందుకే ఈసారి తమిళనాడు నేత అన్నామలైకు చాన్స్ లేదని సమాచారం.