Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి అదే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర పెద్దలు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మొన్న మధ్యన వైవి సుబ్బారెడ్డి ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అవి వర్క్ అవుట్ కాలేదు. అందుకే పార్టీ ఎంపీలంతా కలిసి అమిత్ షాను కలిశారు. కూటమి ప్రభుత్వంపై కొన్ని రకాల ఫిర్యాదులు చేశారు. అయితే అన్ని కుదిరి ఉంటే.. పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఉండేవారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ముందే దరఖాస్తు చేసుకున్నారు అపాయింట్మెంట్ కోసం. అయితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసి కేంద్ర పెద్దలు ఆ దరఖాస్తును తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పట్లో అపాయింట్మెంట్ లభించే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్న మాట. జాతీయస్థాయిలో ఒక రకమైన అస్పష్టమైన రాజకీయం నడుస్తోంది. అందుకే ఎన్డీఏ పరంగా ఐక్యత కోసం కేంద్ర పెద్దలు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే ఏపీలో కూటమిపరంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లో చాలా సులువుగా..
కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి చాలా చనువు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు. ఆ సమయంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని చేరదీసుకున్నారు కేంద్ర పెద్దలు. 2019 ఎన్నికల్లో వ్యవస్థల పరంగా పూర్తి సహకారం అందింది జగన్మోహన్ రెడ్డికి. 2019 నుంచి 2024 మధ్య జగన్ కోరుకోవడమే తరువాయి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసేవారు. చాలా సులువుగా అప్పట్లో అపాయింట్మెంట్ లభించేది. జగన్ నాడు ఎన్డీఏలో చేరలేదు కానీ అంతకుమించిన స్నేహితుడు అన్నట్టు ఉండేది పరిస్థితి. అప్పట్లో బీజేపీని విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కేంద్ర పెద్దల సహకారం కోసం వారిని కలిసేందుకు ప్రయత్నించారు. వారి అపాయింట్మెంట్ ను కోరారు. కానీ ఐదేళ్లపాటు అపాయింట్మెంట్ లభించలేదు.
* ఇబ్బందులు రాకూడదని..
రాజకీయాలు అన్నాక ఇటువంటివి సాధారణం. రాజకీయంగా విభేదాలు రావడం కూడా సహజం. గెలుపు ఓటములు కూడా సహజం. అయితే ప్రధాని స్థాయి నేతలు చాలా పరిపక్వతతో ఆలోచిస్తారు. చాలా రకాల అంశాలు ఇందులో పరిగణలోకి వస్తాయి. అయితే గత రెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఏపీలో ఓటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్య పక్షంగా ఉంది. అదే సమయంలో ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే రాజకీయంగా ద్వంద విధానాలను అనుసరించినట్టు ఉంటుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ సైతం జగన్ విషయంలో వెనక్కి తగ్గారు. ఆ పార్టీ నేతల వరకు ఓకే కానీ.. జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిసి అవకాశం ఇవ్వడం లేదు. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామమే. గతంలో కోరుకున్న సమయంలో ఇట్టే వారి వద్దకు వెళ్ళిపోయేవారు జగన్. ఇప్పుడు వస్తామన్నవారు అనుమతి ఇవ్వకపోవడం నిజంగా ఇబ్బందికరమే.