North Andhra Politics: ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతాలవారీగా రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే కూటమి మంచి దూకుడు మీద ఉంది. అన్ని ప్రాంతాల్లో సానుకూలతతో పాటు ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది.. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మార్చుకుంటుంది. ప్రాంతాలవారీగా వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతుంది. మాజీమంత్రి అప్పలరాజు, చింతాడ రవి కుమార్ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత రాజకీయంగా సీన్ మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. దానిని కప్పిపుచ్చుకునే క్రమంలో జగన్ చేసిన పనులు కూడా ఆ పార్టీని మరింత ఇరకాటంలో పెట్టేసాయి.
* మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం..
మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. శ్రీకాకుళం తో పాటు విజయనగరంలో కూటమి స్వీప్ చేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటినుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు పడుతోంది. కానీ ఆ పార్టీకి ఇటీవల జరిగిన పరిణామాలు డ్యామేజ్ చేశాయి. నేతల వ్యక్తిగత వ్యవహార శైలి ఇబ్బందుల్లో పెట్టాయి. వాటిని అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సమర్థించి.. మళ్లీ ఆ వివాదాలతో పార్టీ ప్రజల్లో పలుచన అయింది. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఒక బైక్ ప్రమాదంలో మనిషి మరణానికి కారణం అయ్యారు. కానీ ఆ కేసును నీరుగార్చి తన కుమారుడు స్థానంలో మరొకరిని పోలీస్ కేసుల్లో ఇరికించారు అనేది ఒక అభియోగం మాత్రమే కాదు వాస్తవం కూడా. దానిని అక్కడితో విడిచిపెట్టి ఉంటే బాగుండేది. దానిని మరింత వివాదాస్పదం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అక్కడితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి అదే అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చారు. భారీగా జన సమీకరణ చేసిన క్రమంలో ఓ మహిళా ఎస్సై పై అనుచితంగా ప్రవర్తించారు వైసీపీ శ్రేణులు. ఈ కేసులో వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఒక్కరు అరెస్ట్ అయ్యారు కూడా. ఒక తప్పు సరిపుచ్చుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు చేసి అడ్డంగా బుక్కయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
* కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత..
మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడంతో ఒక రకమైన సానుకూలత ఏర్పడింది కూటమి పట్ల ఉత్తరాంధ్రలో. అంతకుముందు విశాఖకు భారీ ఐటి పెట్టుబడులు కూడా ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖ కు రానుంది. ఐటీ అనుబంధ పరిశ్రమలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూటమి పట్ల సానుకూలత ఉంటే.. నేతల వ్యక్తిగత వ్యవహార శైలి మూలంగా వైసీపీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలానే కొనసాగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.