Jagan: జగన్ లో ఓటమి భయం పెరిగిందా? గతం మాదిరిగా ధీమా కనిపించడం లేదా? ఇటీవల జరిగిన వరుస పరిణామాలే కారణమా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. జగన్ స్వరం మారడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతోందని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాను బటన్లు నొక్కి డబ్బులు విడుదల చేసినా.. అవి జనాలకు చేరకుండా అడ్డుకుంటున్నారని, అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని.. అందుకే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? అన్న అనుమానం కలుగుతోందని జగన్ నిరాశతో చెప్పడం చర్చకు దారితీస్తోంది.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మాత్రం వైసీపీకి నష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో సైతం కెసిఆర్ ఇదే మాదిరిగా మాట్లాడారని.. ప్రజల మూడ్ తెలుసుకుని నెగిటివ్ గా మాట్లాడడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని.. ఇప్పుడు జగన్ సైతం అదే తరహాలో చెబుతుండడం.. ఆఖరి రాగం పాడేసారంటూ ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది ఈ వీడియోను. అయితే వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలతోనే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని.. అయితే అవి వైసీపీ శ్రేణులకు భయాందోళనలో నెట్టడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వైసీపీ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. దీనికి తోడు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూటమిలోకి వచ్చింది. బిజెపి అగ్ర నేతలు ఏపీకి వచ్చి మరి వైసీపీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. డిజిపి నుంచి కిందిస్థాయి అధికారి వరకు బదిలీల వేటుపడుతోంది. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ లో బాహటంగానే ప్రభుత్వ వ్యతిరేకతను కనబరుస్తున్నారు. తాము కూటమి వైపు మొగ్గు చూపినట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇన్ని పరిణామాల నడుమ ఏపీలో నెగ్గుకు రావడం వైసిపికి కష్టమే. అందుకే జగన్ అస్త్ర సన్యాసం చేశారని.. ముందుగానే ఓటమిని ఒప్పుకున్నారని విపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే జగన్ ఆఖరి రాగం పాడేసారన్న పోస్టులు భారీగా వెలుస్తున్నాయి. తెగ ట్రోల్ అవుతున్నాయి. వైసిపి శ్రేణులను కంగారు పెడుతున్నాయి.