Lok Sabha Deputy Speaker Post: ఏపీకి ( Andhra Pradesh) మరో రాజకీయ పదవి అందించేందుకు కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలోనూ ఆ పదవిని అలాగే ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్న ఆ పోస్టును ఇంకా భర్తీ చేయలేదు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది కేంద్రం. పైగా మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతో ఆ పార్టీకి సంప్రదాయంగా కేటాయించాల్సిన లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టును ఇవ్వకుండా చేయాలని చూస్తోంది. ఆ పదవిని ఏపీ నుంచి భర్తీ చేయాలని కేంద్ర పెద్దలు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
* ప్రతిపక్ష పదవి అది..
వాస్తవానికి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ( deputy speaker) పోస్ట్ అనేది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కు కేటాయించాలి. దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది. అయితే స్పీకర్ తర్వాత రాజ్యాంగబద్ధ పదవి డిప్యూటీ స్పీకర్. చాలా రకాల రాజకీయ నిర్ణయాలు డిప్యూటీ స్పీకర్ వద్ద ఉంటాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని బిజెపి భావించింది. అందుకే గతసారి కేంద్రంలో అధికారంలో వచ్చినప్పుడు కూడా ఆ పోస్టును భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచింది. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. కానీ ఇంతవరకు ఆ పోస్ట్ భర్తీ చేసే సాహసం చేయలేదు. అయితే రెండు బలమైన బిల్లులు పార్లమెంటులో వీగి పోవడానికి ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రాలు. అందుకే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏపీకి కేటాయించినట్లు తెలుస్తోంది.
* ప్రముఖంగా పురందేశ్వరి పేరు..
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కు ప్రధానంగా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు ఆ పోస్టులో నియమించడం ద్వారా ఏపీకి ప్రాధాన్యమిచ్చినట్టు ఉంటుంది. ఎన్టీఆర్ కుటుంబానికి సముచిత స్థానం కల్పించినట్టు ఉంటుంది. పురందేశ్వరి విషయంలో సీఎం చంద్రబాబు అనుకూలంగా ఉంటారు. తప్పకుండా మద్దతు తెలుపుతారు. వాస్తవానికి పురందేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం నడిచింది. లోక్సభ స్పీకర్ గా కూడా ఛాన్స్ ఇస్తారని టాక్ నడిచింది. అదే సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారని కూడా తెగ హడావిడి నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అందుకే ఈసారి ఆమెకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తప్పకుండా కేటాయిస్తారు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.