Vemuri Radhakrishna: ఆ ఎలక్ట్రానిక్ మీడియా ను వదిలేయండి.. అందులో వచ్చే వార్తలు బాగోవు. చెప్పే వ్యాఖ్యాతలకు తెలుగు రాదు. తెలుగు మీద కనీసం పట్టు కూడా ఉండదు. ఏ పదాన్ని ఎలా పలకాలి.. ఏ వాక్యాన్ని ఎలా వ్యక్తీకరించాలి అనే విషయం తెలియదు. కానీ ప్రింట్ మీడియా అలా కాదు కదా.. అందులో ప్రింట్ అయ్యే ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ప్రతి పదానికి ఒక బరువు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాసే వార్తకు.. పెట్టే శీర్షికకు.. లీడ్.. ఇలా ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది.
ఆ పిడిఎఫ్ పేపర్లను.. సో కాల్డ్ ఆన్లైన్ ఎడిషన్లను పక్కన పెడితే.. ఇప్పటికీ ఫిజికల్ గా వస్తున్న పేపర్లను పరిశీలిస్తే.. అందులో క్రాస్ చెకింగ్ అనే వ్యవస్థ లేనట్టు తెలుస్తోంది. ఈనాడు .. సాక్షి.. ఆంధ్రజ్యోతి.. ఈ మూడు తెలుగులో ప్రధాన పత్రికలుగా కొనసాగుతున్నాయి. అయితే వీటిలో ఆంధ్రజ్యోతి పత్రిక నిర్వహణ దారుణంగా ఉన్నట్టు కనిపిస్తోంది.. ఫస్ట్ పేజీలో దమ్మున్న వార్తలు వస్తున్నప్పటికీ.. జిల్లా ఎడిషన్లు.. లోపలి పేజీలలో బండతప్పులు.. అన్వయ లోపాలు.. తాటికాయ పరిమాణంలో ఉన్న అక్షరాలలో కూడా విపరీతమైన దోషాలు.. ఆ పత్రిక నిర్వహణ తీరుకు అద్దం పడుతున్నాయి.
మూతపడిన ఆంధ్రజ్యోతి పేపర్ ను తిరిగి లేపిన ఘనత రాధాకృష్ణది. ప్రస్తుతం తెలుగు మీడియాలో తిరుగులేని పాత్రికేయుడిగా రాధాకృష్ణ కొనసాగుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఆంధ్రజ్యోతి పత్రికనే. ఈరోజుకి కూడా ప్రతి ఆదివారం రాధాకృష్ణ రాసే కొత్త పలుకు వ్యాసాన్ని చదవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతటి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ స్థాయిలో శీర్షిక దోషాలు.. బండ తప్పులు వస్తే.. అది రాధాకృష్ణకే నామర్ద. పైగా గతంలో మాదిరిగా రాధాకృష్ణ పత్రికను చూసుకున్నట్టు కనిపించడం లేదు. డెస్క్ లలో ప్రూఫ్ రీడింగ్ వ్యవస్థ లేకుండా పోయింది. ఉన్న అరకొర సబ్ ఎడిటర్లు పేజీలు పెట్టడం వల్ల.. అడ్డగోలుగా తప్పులు వస్తున్నాయి.
తాజాగా ఖమ్మం ఎడిషన్ లో ఓ వార్తకు సంబంధించి “ఆ పీఏ బాధితులందెరో” అని శీర్షిక పెట్టారు. బాధితులు ఎందరో అని ఉండాల్సింది.. పైగా లోపలి పేజీలో తాటికాయ పరిమాణంలో ఆ శీర్షిక పెట్టారు. ప్రింట్ అయినప్పటికీ.. కనీసం ఆన్లైన్ ఎడిషన్ కైనా అప్డేట్ చేయాల్సి ఉండేది. అలా కూడా చేయలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మై డియర్ ఆర్కే సార్ కేవలం ఏబీఎన్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఆంధ్ర జ్యోతిని పట్టించుకోండి. ఎందుకంటే మీ ఉన్నతికి ఆంధ్రజ్యోతి బాటలు వేసింది. దాన్ని మర్చిపోకండి.