దేశంలో సైబర్ మోసాలు(Cyber fraud) రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసాల బారిన పడి ఎక్కువగా అమాయకులు మోసపోతుంటే కొన్ని సందర్భాల్లో చదువుకున్న వాళ్లు సైతం సైబర్ మోసాల బారిన పడుతున్నారు. సైబర్ మోసాల బారిన పడితే 100 లేదా 155260 నంబర్(Helpline Number) కు మొదట ఫోన్ చేయాలి. కేంద్ర హోం శాఖ 155260 నంబర్ ద్వారా పోయిన నగదును తిరిగి పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం.
సైబర్ మోసాల బారిన పడి మోసపోయిన వాళ్లు ఫోన్ నంబర్, బదిలీ అయిన ఖాతాల నంబర్లు, యూపీఐడీ నంబర్లు, ఇతర డిజిటల్ ప్లాట్ఫాం ఖాతాల నంబర్లను నోడల్ అధికారికి చెప్పాలి. ఆ తర్వాత అధికారులు బ్యాంక్ లు, ఇతర ఖాతాల వివరాల సమాచారాన్ని పంపి అకౌంట్ల లావాదేవీలను నిలిపివేయడంతో పాటు నగదును ఫ్రీజ్ చేస్తారు. ఈ నంబర్ గుర్తులేని వారు 100 నంబర్ కు కాల్ చేయడం ద్వారా డబ్బులను రిటర్న్ పొందవచ్చు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 75 లక్షల రూపాయలను ఈ విధంగా ఆపగలిగారని సమాచారం. గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు నగదును బదిలీ చేయవద్దని మోసపోతే 24 గంటల్లొగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే మాత్రం పైసా కూడా తిరిగిరాదని మోసాలపై అవగాహన పెంచుకుంటే మంచిదని పోలీసులు సూచనలు చేస్తుండటం గమనార్హం.
ఎందుకు, ఎక్కడకు, ఎవరికి డబ్బులు పంపిస్తున్నామనే అవగాహనను కచ్చితంగా కలిగి ఉండాలి. ఏదైనా కారణాల వల్ల పొరపాటున లావాదేవీ జరిగి డబ్బులు కట్ అయితే మాత్రం వెంటనే డబ్బుల గురించి ఫిర్యాదు చేస్తే మంచిదని చెప్పవచ్చు.