BRS Former MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది తామే అని స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ.. జనాల మీద పడి దోచుకుంటూ దొరికిపోతున్నారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఒక మహిళ ను లైంగికంగా వేధించిన కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. దాన్ని మర్చిపోకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దోపిడీ కేసులో ఇరుక్కున్నారు.
భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు పరిధిలో నమోదైన సైబర్ దోపిడి కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. అయితే ఈ వ్యక్తి ఖమ్మం జిల్లాలో ఒక మంత్రి శిబిరంలోకి చేరడానికి ప్రయత్నించారు. అయితే అప్పుడే ఇతని మీద సైబర్ నేరాలు నమోదు కావడంతో ఆ మంత్రి దూరం పెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అరెస్ట్ చేస్తారేమోనని ఇదే నిందితుడు దుబాయ్ పారిపోయాడు. నాటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. చివరికి తెలంగాణ పోలీసులు ఇతడిని పట్టుకున్నారు.
ఈ వ్యక్తి ఓ మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. గతంలో భారత రాష్ట్ర సమితికి చెందిన అత్యంత కీలక నాయకుడిని కల్లూరు దాకా రప్పించాడు. ఆ ఖర్చు మొత్తం తనే పెట్టుకున్నాడు. పైగా సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించాడు. అయితే సైబర్ దోపిడీ కేసులో పట్టుబడ్డ ఇతడిని పోలీసులు ప్రశ్నించి మాత్రమే వదిలేస్తారా.. లేక అరెస్ట్ చేస్తారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇతడి వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.
ఈ సైబర్ క్రైమ్ లో ఆ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు వందల కోట్లు వెనుకేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ముందుగా కార్యకలాపాలు మొదలుపెట్టి.. ఆ తర్వాత విదేశాలకు ఈ దందా విస్తరించినట్టు సమాచారం. ఐటీ కంపెనీ తరహాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని.. కొంతమంది ఉద్యోగులను నియమించుకొని ఈ దోపిడీకి పాల్పడ్డారు. అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆ వ్యక్తి భావించాడు. కానీ చివరికి అతడి నిజ స్వరూపం బయటపడడంతో.. దొరికిపోయాడు. దుబాయ్ పారిపోయినప్పటికీ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకొని మరి ప్రశ్నిస్తున్నారు.