HYDRA Ranganath: ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊరట. ఎందుకంటే కొద్దిరోజులుగా రేవంత్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒత్తిడి మామూలుగా లేదు. కొండా సురేఖ.. అంతకుముందు చిన్నారెడ్డి.. అంతకుముందు హైడ్రా బాస్ గా ఉన్న రంగనాథ్ ను తప్పించాలని హైకోర్టు ఆగ్రహం.. ఈ పరిణామాలు మొత్తం రేవంత్ రెడ్డికి మాములు తలనొప్పి కలిగించలేదు.
ఇన్ని ఇబ్బందుల తర్వాత.. ఇన్ని రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న తర్వాత రేవంత్ రెడ్డికి శిరోభారం తగ్గింది. కాస్తలో కాస్త ఉపశమనం లభించింది. ఒక ముక్కలో చెప్పాలంటే గులాబీ పార్టీ చేస్తున్న నెగిటివ్ ప్రపగండా నుంచి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు కొంతమేర సాంత్వన కలిగించింది. హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ విషయంలో హైడ్రా అధినేత దూకుడు కొనసాగించారు. ఆ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంలో కంచె నిర్మించారు. ఇది ఆ కంపెనీకి ఇబ్బందికరంగా మారింది. ఇంకేముంది ఆ కంపెనీ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ కేసును విచారించి హైడ్రా అధినేత రంగనాథ్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ పోస్ట్ నుంచి తొలగిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది.
దీనిని సవాల్ చేస్తూ రంగనాథ్ హైకోర్టులో అప్పిల్ కు వెళ్లారు. కేసును విచారించిన మరో బెంచ్ రంగనాథ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. దీంతో రంగనాథ్ కు ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ గులాబీ మీడియా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కానీ చివరికి రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి పంతం నెగ్గింది. ఇకపై హైడ్రా విషయంలో రంగనాథ్ మరింత దూకుడు కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మరోవైపు రంగనాథ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఆక్టివ్ అయ్యారు. హైడ్రా చేస్తున్న పనులను తెగ ప్రమోట్ చేస్తున్నారు.
హైడ్రా కూడా సోషల్ మీడియాలో తాము చేసిన పనులకు సంబంధించిన వీడియోలను ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది.. చెరువులను అభివృద్ధి చేసిన తీరు.. వాటిని హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన తీరును.. బయటపెడుతోంది. ఈ ప్రకారం చూసుకుంటే హైడ్రా చీఫ్ స్థానం నుంచి రంగనాథ్ ను తొలగించే సాహసం రేవంత్ రెడ్డి చేయరు. ఆ స్థానం నుంచి తప్పుకోవడానికి రంగనాథ్ ఒప్పుకోరు. మరి ఇప్పుడు పింక్ మీడియా ఎలాంటి స్టోరీలు రాస్తుంది.. పింక్ పార్టీ ఎలాంటి ఉద్యమాలు చేస్తుంది.. చూడాల్సి ఉంది.