Hyderabad real estate : ఇది నగ్న సత్యం. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే కేవలం శ్రీమంతులకు మాత్రమే అనుకూలంగా ఉండేలాగా హైదరాబాద్ నగరం మారిపోయింది. ముఖ్యంగా కొత్త నగరంలో అయితే సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ఈ మాట అన్నది ఎవరో కాదు హైడ్రా బాస్ రంగనాథ్.
ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో హైడ్రా రంగనాథ్ పాల్గొన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రం గురించి ఆయన ఓపెన్ గా చెప్పేశారు. ఆయన చెప్పిన ప్రతి మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మెజారిటీ ప్రాంతాలలో సామాన్యులు ఇల్లుకొనే పరిస్థితి లేదు. చివరికి ఎగువ మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే స్థిరాస్తి వ్యాపారులు ఆ స్థాయిలో ధరలు పెంచేసి వదిలేశారు. ఓ నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరంలో దాదాపు 80,000 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. స్థిరాస్తి వ్యాపారులు భారీగా ధరలు పెంచడంతో గృహాలు అమ్ముడుపోవడం లేదు.
హైదరాబాద్ నగరంలో ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్ల కల్చర్ పెరిగిపోయింది. ఒకప్పుడు 20 లక్షల లోపు డబుల్ బెడ్ రూమ్ వచ్చేది. 35 లక్షల లోపు త్రిబుల్ బెడ్ రూమ్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తక్కువలో తక్కువ రెండు నుంచి మూడు కోట్లు ఖర్చు పెడితే తప్ప ప్లాట్ కొనే పరిస్థితి లేదు. ఇక గేటెడ్ కమ్యూనిటీలలో.. పది కోట్ల వరకు ఉంటుంది. లగ్జరీ ఏరియాలలో ఏడు నుంచి తొమ్మిది కోట్ల వరకు ప్లాట్ పలుకుతుంది. దీనిని బట్టి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం ఎలా మారిపోయింది అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితిని పూస గుచ్చినట్టు చెప్పారు రంగనాథ్. భారీగా సంపాదనకు అలవాటు పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు అండతో కలిసి చెరువులను.. కుంటలను.. నాలాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఆపై అధికారులను మచ్చిక చేసుకుని.. విక్రయించడం మొదలుపెట్టా. చివరికి నీటి వనరులను పరిరక్షించుకునే క్రమంలో హైడ్రా వంటి వ్యవస్థ రంగంలోకి దిగినప్పుడు.. ఈ దుర్మార్గాలు బయట పడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసలు మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటప్పుడు కచ్చితంగా హైడ్రా వంటి వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆక్రమణలు పెరిగిపోతుంటే నగరం అధ్వానంగా మారుతుంది. ఎండాకాలంలో తాగడానికి నీరు దొరకదు. వానకాలంలో నీరు నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఆక్రమణలు ఉండకూడదు. హైడ్రా వంటి వ్యవస్థ చేస్తున్నది కూడా అదే. మరోవైపు ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రంగనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దుర్మార్గాన్ని.. ధరలు పెంచి సామాన్యులను పెడుతున్న ఇబ్బందిని తెలంగాణ బహిరంగంగానే చెప్పేశారు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ ధరలు పెంచుతున్న తీరుపై ఎలా వ్యవహరిస్తారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఎలా ఉక్కు పాదం మోపుతారో చూడాల్సి ఉంది.