Rahul Gandhi: తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మరో ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆదివారం తెలంగాణలో పర్యటించారు. నిర్మల్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.
ఏమన్నాడంటే..
నిర్మల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ అమలుచేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతుంది. ఈ క్రమంలో తెలంగాణ అప్పుడే దేశానికి ఆదర్శంగా నిలిచిందా.. రేవంత్ సర్కార్ నిలిపిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అమలు కాని గ్యారంటీలు..
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది కాంగ్రెస్. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా. పూర్తిస్థాయిలో గ్యారంటీలు అమలు కాలేదు. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు కాలేదు, పింఛన్లు పెంచలేదు. మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం అందడం లేదు. విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదు. హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా తెలంగాణ మోడల్ అని రాహుల్ ప్రకటిచండం విమర్శలకు కారణమైంది. రాహుల్ ప్రకటన కాంగ్రెస్కు ఏమాత్రం మేలు చేస్తుందో తెలియదు కానీ, విపక్ష బీజేపీ, బీఆర్ఎస్కు కొత్త అస్త్రం ఇచ్చినట్లుయింది.
బీఆర్ఎస్కు బలం..
రాహుల్ చేసిన ప్రకటన బీఆర్ఎస్కు బలాన్ని ఇచ్చింది. తెలంగాణలో పదేళ్లు తాము చేసిన అభివృద్ధినే రాహుల్గాంధీ దేశమంతా అమలు చేస్తామని ప్రకటించారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పనులు చేయలేదని విమర్శించే అవకాశం కూడా ఉంది. తమ దూరదృష్టితో కూడిన పాలనకు రాహుల్ ప్రకటన నిదర్శనమని ఓన్ చేసుకునే అవకాశం ఉంది.
హామీలు అమలు చేయకపోవడమేనా..
ఇక మరోవైపు.. బీజేపీ కూడా ఈ ప్రకటనను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. తెలంగాణ మోడల్ అంటే ప్రజలకు ఇచ్చే హామీలు, అమలు చేయకపోవడమేనా అని ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. హామీలు నెరవేరకుండానే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.