spot_img
HomeతెలంగాణKCR : కవితకు కేసీఆర్ రాయబారం..

KCR : కవితకు కేసీఆర్ రాయబారం..

KCR : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌)కు రాసిన ఆరు పేజీల లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లేఖలో కవిత, బీఆర్‌ఎస్‌ ఇటీవల ఎల్కతుర్తిలో నిర్వహించిన సిల్వర్‌ జూబ్లీ సభలో కేసీఆర్‌ ప్రసంగం గురించి సానుకూల, ప్రతికూల అంశాలను పేర్కొన్నారు. బీజేపీని కేవలం రెండు నిమిషాలు మాత్రమే విమర్శించడం, వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు, షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ, వక్ఫ్‌ సవరణ చట్టం వంటి కీలక అంశాలను ప్రస్తావించకపోవడం వంటి అంశాలను విమర్శించారు. ఈ లేఖ బహిర్గతం కావడం, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కవితను సున్నితంగా మందలించడంతో పార్టీ కేడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో తనను విమర్శినివారితో కాంప్రమైజ్‌ కాని కేసీఆర్‌.. ఈసారి మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read : దయ్యాలు అని వ్యాఖ్యానించిన కవిత స్వరం ఒక్కసారిగా ఎందుకు మారింది..? కెసిఆర్ ఏం చేసి ఉంటారు?

వారితో రాయబారం..
తన నిర్ణయాతను తప్పు పట్టేవారు, తన నిర్ణయాలను ధిక్కరించేవారు ఎంతటివారైనా కేసీఆర్‌ సహించరు. పొమ్మనలేక పొగబెడతారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్‌ వంటివారు ఇందుకు ఉదాహరణ. కానీ, కవిత విషయంలో మాత్రం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారు. కుటుంబ సభ్యురాలినే సస్పెండ్‌ చేస్తే.. పొమ్మనలేక పొగబెడితే క్యాడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆందోళన నెలకొంది. దీంతో తనకు ఆత్మలాంటి నేతలు రాజ్యసభ సభ్యుడు రామోదర్‌రావును రాయబారానికి కవిత వద్దకు పంపించారు. సోమవారం సాయంత్రం 6–7 గంటల సమయంలో కవిత ఇంటికి వెళ్లిన దామోదర్‌రావు తన వెంట న్యాయవాదిని కూడా తీసుకెళ్లారు. దామోదర్‌ రావు, కేసీఆర్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగిన నేతగా, ‘నమస్తే తెలంగాణ’ పత్రిక స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 2022లో కేసీఆర్‌ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలాంటి నేపథ్యంలో, ఆయన కవితను కలవడం రాజకీయంగా ముఖ్యమైన చర్చలకు దారితీసింది. కేసీఆర్‌ ఈ సందర్శనకు దామోదర్‌ రావును పంపించారా లేక ఇది వ్యక్తిగత సందర్శనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

కవిత వర్సెస్‌ కేటీఆర్‌?
కవిత లేఖ వెలుగులోకి వచ్చిన తర్వాత, బీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఈ లేఖ సమయంలో కేసీఆర్‌కు వారసుడిగా కేటీ.రామారావు (కేటీఆర్‌)ను ప్రకటించే సూచనలు ఉన్నాయి, ఇది కవితకు అసంతృప్తి కలిగించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత లేఖలో కేసీఆర్‌ అప్రాప్యత, పార్టీ క్యాడర్‌తో సంబంధం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా, ఆమె తనకు పార్టీలో సరైన స్థానం లభించడం లేదనే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేటీఆర్‌ ఈ లేఖపై స్పందిస్తూ, పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించడం కాకుండా, పార్టీ వేదికల్లోనే పరిష్కరించాలని పేర్కొన్నారు.

రాజీకి రాకపోతే..
కవిత లేఖ బహిర్గతం కావడం వెనుక ఒక ఉద్దేశపూర్వక రాజకీయ కుట్ర ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ లేఖను కవిత బృందం లీక్‌ చేసి ఉండవచ్చని, లేదా కేసీఆర్‌ కుటుంబంలోని కొందరు ఆమెను ఒంటరిచేయడానికి ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. కొన్ని సమాచారాల ప్రకారం, కవితకు షోకాజ్‌ నోటీసు జారీ చేయడం లేదా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కవిత తన లేఖలో పేర్కొన్న అంశాలు సామాన్య కార్యకర్తల అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయని, తనకు వ్యక్తిగత ఎజెండా లేదని స్పష్టం చేశారు.

బీజేపీతో సంబంధాలపై అనుమానాలు
కవిత లేఖలో బీజేపీపై కేసీఆర్‌ మృదువైన వైఖరిని విమర్శించడం, బీఆర్‌ఎస్‌ ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వంటి అంశాలు, పార్టీ బీజేపీతో సంబంధాలు కలిగి ఉండవచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. కవిత, ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్టును బీజేపీతో ముడిపెడుతూ, ఆ పార్టీపై గట్టిగా విమర్శించాలని కేసీఆర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ లేఖను ఉపయోగించుకుని బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలను హైలైట్‌ చేస్తున్నారు.

రాజీ లేదా విభజన?
దామోదర్‌ రావు సందర్శన, కవిత లేఖ వివాదం బీఆర్‌ఎస్‌లో రాజీకి దారితీస్తాయా లేక పార్టీలో విభజనకు కారణమవుతాయా అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. కొందరు రాజకీయ విశ్లేషకులు, కవిత కాంగ్రెస్‌తో చేతులు కలపవచ్చని లేదా కొత్త పార్టీని స్థాపించవచ్చని ఊహిస్తున్నారు. అయితే, కవిత తన విధేయత కేసీఆర్‌కు ఉందని, పార్టీలో చిన్నపాటి లోపాలను సరిదిద్దితే బీఆర్‌ఎస్‌ దీర్ఘకాలం అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular