EMI Phone Purchase: నేటి కాలంలో చాలా మంది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇలాం టి వారి విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక మార్పులను తీసుకుంది. ఆన్ లైన్ ద్వారా ఏదైనా ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ ఫోన్ లాక్ అయ్యే అవకాశం ఉంది. దశల వారీగా ఈ ఫోన్ ఫీచర్లను పనిచేయకుండా మొత్తంగా 60 రోజుల వరకు లాక్ అవుతుంది. అయితే ఇది అన్ని రకాల రుణాలకు వర్తించదు. ఈ కొత్త రూల్స్ వివరాల్లోకి వెళితె..
ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వారి విషయంలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ఆర్బీఐ ప్రకటించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన ఒక్క ఈఎంఐ కూడా చెల్లించని పక్షంలో ఫోన్ లాక్ అయ్యే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం కేంద్ర బ్యాంకు తుది నిబంధనలను విడుదల చేసింది. రుణ వసూళ్లలో సాంకేతికతను వినియోగించేందుకు అనుమతిస్తూ, అదే సమయంలో వినియోగదారుల హక్కులను కూడా రక్షించేలా ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే ఒక ఈఎంఐ మిస్సయిన వెంటనే మొబైల్ను లాక్ చేయరు. ముందుగా కొన్ని ఫీచర్లను పనిచేయకుండా చేస్తారు. 30 రోజుల తర్వాత కొన్ని ఫీచర్లను .. 60 రోజుల పాటు ఈ ఎంఐ చెల్లించని పక్షంలో ఆ ఫోన్ పూర్తిగా లాక్ చేసే అవకాశం ఉంది. ఇలా ఫోన్ లాక్ చేస్తామని ముందుగానే ఒప్పందంలో పేర్కొంటారు. అయితే ఇలాంటి డివైస్పై పరిమితులు విధించినప్పటికీ కొన్ని కీలక సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరు. వీటిలో ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్ లు, అత్యవసర కమ్యూనికేషన్ సేవలు, ప్రభుత్వ అత్యవసర హెచ్చరికలు, అలాగే పని లేదా ఉపాధికి అవసరమైన ప్రాథమిక ఫీచర్లు అందుబాటులో ఉంచుతారు.
అలాగే పర్సనల్ డేటా విషయంలో కూడా నిబంధనలు సడలింపు ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసిన వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, వ్యక్తిగత ఫైళ్లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చూడటానికి లేదా యాక్సెస్ చేయడానికి కంపెనీలకు ఎలాంటి హక్కు ఉండదు. అందువల్ల వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు.