నేటి కాలంలో కూడా బ్లాక్ మ్యాజిక్ నమ్ముతారా.. ఏవో శక్తులు ఉన్నాయంటే విశ్వసించాలా.. నిజంగానే.. దయ్యాలు.. ఉన్నాయా.. ఉంటే వాటికి పూజలు చేసి వశం చేసుకోవచ్చా.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుతం పరిణామాలు దయ్యాలు.. క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతున్నాయి.
ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. అరచేతులలో ప్రపంచం మొత్తాన్ని సులువుగా చూడగలుగుతున్నాం. ఏం జరిగిందో వెంటనే తెలుసుకోగలుగుతున్నాం. ఏం జరుగుతుందో కూడా అంచనా వేయగలుగుతున్నాం. ఇటువంటి కాలంలో క్షుద్ర పూజలు చేయడం ఏంటి.. ఎదుటివారి కీడును కోరుకునేందుకు పూజలు చేయడమేంటి.. వీటి ద్వారా అవన్నీ జరుగుతాయా.. అసలు అవన్నీ సాధ్యమేనా
ఇటీవల భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రఖ్యాతమైన క్షేత్రాలను ఆయన సందర్శించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ క్షేత్రాలను సందర్శించడం వెనక కారణం వేరే ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా చిత్ర పూజలు చేయడానికి హరీష్ రావు వేరే ప్రాంతాలలో ఉన్న క్షేత్రాలను సందర్శించారని.. అక్కడ క్షుద్ర పూజలు కూడా చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా విలేకరుల ముందుకు వచ్చి హరీష్ రావును తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి నాయకులకు క్షుద్ర పూజలు చేయడం అలవాటేనని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్లింది.. ఎవరిని కలిసింది.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏ తరహాలో వ్యవహరించింది అంతా తెలుసని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
మరోవైపు హరీష్ రావు మీద చేస్తున్న ఆరోపణల పట్ల ఆయన వర్గం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు మతిభ్రమించిందని.. ప్రజలకు ఎటువంటి మంచి పనులు చేయకపోగా.. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని హరీష్ వర్గం నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు మీద హరీష్ రావు లీగల్ నోటీసులు ఇచ్చారు. తాను క్షుద్ర పూజలు చేశానని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని.. లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని హరీష్ రావు ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి హరీష్ రావు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అయితే ఆ పుణ్యక్షేత్రాల సందర్శన వెనక క్షుద్ర పూజలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. హరీష్ రావు ఎన్ని రకాల పూజలు చేసినప్పటికీ గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని.. మళ్లీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని హస్తం నేతలు స్పష్టం చేస్తున్నారు.