Revanth Reddy : ఒకసారి అధికారం వచ్చిన తర్వాత కొత్త కొత్త శక్తులు తెరపైకి వస్తుంటాయి. అప్పటిదాకా పార్టీతో సంబంధం లేని వాళ్ళు.. పార్టీ కండువా కప్పుకుంటారు. పార్టీ కోసం సేవ చేసినట్టు బిల్డప్ ఇస్తుంటారు. మీడియా ముందు పెద్దపెద్ద ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ వాళ్ళు పార్టీ కోసం చేసింది శూన్యం.
అదేం దరిద్రమో తెలియదు గాని.. కాంగ్రెస్ పార్టీలో పై ఉపోద్ఘాతానికి సంబంధించిన సంస్కృతి దర్జాగా సాగుతూ ఉంటుంది. దీనిని ఎవరు ప్రవేశపెట్టారు.. ఎందుకోసం ప్రవేశపెట్టారు.. ఎందుకోసం కొనసాగిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం ఎవరి వద్ద ఉండదు. పైగా పార్టీ కోసం కష్టపడకపోగా.. పార్టీని ఇబ్బంది పెట్టడానికి.. పదిమందిలో చులకన చేయడానికి బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. వీళ్ల వల్ల కాంగ్రెస్ పార్టీని ఎవరో బయట వాళ్ళు ఓడించాల్సిన అవసరం లేదు. వీరు జస్ట్ నాలుగు మాటలు మాట్లాడితే చాలు.. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి అవసరం లేకుండానే ఓటమి ఎదురవుతుంది. 2014.. 2018 ఎన్నికల్లో ఎదురైన ఓటముల నుంచి కాంగ్రెస్ పార్టీ తేరుకుంది. రేవంత్ రెడ్డి పుణ్యం వల్ల.. కెసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అధికారంలో వచ్చిన పార్టీని మరింత బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని మరింత గొప్పగా సుస్థిరం చేసేందుకు అడుగులు వేయాల్సిన క్రమంలో కొంతమంది నాయకులు చేస్తున్న అతి కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచుతోంది. ప్రత్యర్థి పార్టీల నాయకుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద.. ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వారి ధోరణి చూస్తే.. కాంగ్రెస్ పార్టీని మిగిలిన కాలం కూడా సాఫీగా అధికారాన్ని కొనసాగించే అవకాశం లేకుండా చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటినుంచి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరికితే చాలు ముఖ్యమంత్రిని పరోక్షంగా విమర్శిస్తున్నారు. దోపిడికి పాల్పడుతున్నారని.. దుర్మార్గాలకు పాల్పడుతున్నారని.. కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మొహమాటం లేకుండా చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి.
చిన్నారెడ్డి
మేఘా రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర్నుంచి చిన్నారెడ్డి చిన్న బుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద.. ముఖ్యమంత్రి మీద ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా మాట్లాడుతున్నారు. మేఘా రెడ్డి ముడుపులు ఇచ్చారని.. ఎమ్మెల్యే టికెట్ తగ్గించుకున్నారని ఇటీవల కాలంలో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవసరమైతే తాను మరో జీవన్ రెడ్డి లాగా మారతానని హెచ్చరికలు జారీ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ చిన్నారెడ్డి తన స్థాయి మర్చిపోయి విమర్శలు చేయడం విశేషం.
కొండ సుస్మిత
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికి ఎక్కాయని విమర్శించారు. పరకాల టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఏ విధంగా హామీ ఇస్తారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సోదరుడికి భూములు కట్టబెడుతున్నారని.. దోపిడికి పాల్పడుతున్నారని.. తనకు కౌంటర్ ఇస్తే.. పూర్తి ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ దోపిడిని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. సుస్మిత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే కొండా సురేఖకు షోకాసు నోటీసులు జారీ చేసింది.
అనిరుద్ రెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అనిరుద్ రెడ్డి.. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద.. ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. ముఖ్యమంత్రి మీద నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.. అంతేకాదు, పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంతం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ.. అనిరుద్ రెడ్డి ఏమాత్రం భయపడడం లేదు. పైగా ముఖ్యమంత్రి పర్యటనలకు ఒక్కొక్కసారి దూరంగా ఉంటున్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారు.
ఈ నలుగురు మాత్రమే కాదు.. ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ.. ఆయనను విమర్శిస్తున్నారు. పైగా ఇటీవల కాలంలో తమ స్వరాన్ని పెంచి ప్రతిపక్ష నాయకులను మించి పోతున్నారు. వీరి వ్యవహార శైలి ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు కదా.. కనీసం చెప్పుకునే స్థాయిలో సీట్లు సాధించే అవకాశం కూడా ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.