Mangala Gauri Vratam: శ్రావణమాసం సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ సమయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తుల సైతం శ్రావణమాసం ను పవిత్రంగా భావిస్తూ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఇదే సమయంలో నోములు, వ్రతాలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ నెలలో ప్రతి మంగళవారం నాడు మంగళ గౌరీవ్రతం నిర్వహించుకుంటారు. అసలు మంగళ గౌరీ అంటే ఎవరు? ఈ వ్రతాన్ని పెళ్లయిన వారు మాత్రమే ఎందుకు చేయాలి? వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
పార్వతీదేవి స్వరూపమే మంగళ గౌరీ అని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది. మంగళం అంటే శుభప్రదం. గౌరీ అంటే పవిత్రత. శివుడి సహచరిగా గౌరీదేవి రూపంలో తన కుటుంబానికి, దాంపత్య జీవితానికి, సంతానానికి శుభాన్ని కలిగించే విధంగా వరాలు ఇస్తుందని అంటారు. గౌరీదేవిని మంగళవారం నాడు ప్రత్యేకంగా పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని అంటుంటారు.
మంగళ గౌరీ వ్రతాన్ని ఎక్కువగా వివాహం అయిన మహిళలే చేస్తారు. ఎందుకంటే తమ దాంపత్య జీవితం, కుటుంబ సంతోషం శ్రేయస్సుగా ఉండాలని ఈ పూజ చేయడం వల్ల పార్వతీదేవి వరాలు ఇస్తుందని అంటారు. ఈ వ్రతం కేవలం వ్యక్తిగత కోరికలు మాత్రం కాకుండా తమ కుటుంబ సంక్షేమం కోసం చేయడం వల్ల చాలామంది తమ వారు బాగుండాలని కోరుకుంటూ చేస్తారు.
మంగళ గౌరీ వ్రతం చేసేవారు ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ మందిరంలో అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీఠంపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఎదురుగా కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత గౌరీదేవికి సంబంధించిన స్తోత్రాలు, మంత్రాలు చదవాలి. కుటుంబ ఆచారం ప్రకారం పాయసం, పులిహోర వంటి నైవేద్యాలను ఏర్పాటు చేయాలి. అనంతరం మంగళ గౌరీ వ్రత కథను చదవడం లేదా వినడం సాంప్రదాయం. చివరగా కర్పూర హారతి ఇచ్చి మంగళ గౌరీ దేవిని ప్రార్థించాలి.
మంగళ గౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్లయిన మహిళలు ఆచరించడం వెనక జీవితానికి శుభారంభం గా భావిస్తారు. వివాహం తర్వాత కొత్త బాధ్యతలు, కొత్త బంధాలు ఏర్పడతాయి. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ జీవితాంతం సంతోషంగా ఉంటారని భావిస్తారు. అలాగే తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం సందర్భంగా మహిళలు ఒక్కచోటికి వస్తారు. తాంబూలాలు ఇచ్చుకోవడం, వ్రత కథలు వినడం వంటివి చేయడం వల్ల వారి మధ్య ఐక్యత పెరుగుతుంది.